ఆయుర్వేదం ఆహారంతో వ్యాధినిరోధక శక్తి!

ABN , First Publish Date - 2020-08-25T05:30:00+05:30 IST

వర్షాకాల వాతావరణంతో విజృంభించే రుగ్మతల నుంచీ, మరీ ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ

ఆయుర్వేదం  ఆహారంతో వ్యాధినిరోధక శక్తి!

వర్షాకాల వాతావరణంతో విజృంభించే రుగ్మతల నుంచీ, మరీ ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకవ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారం పట్ల అవగాహన ఏర్పరుచుకుని శక్తిని ఇచ్చే పరిపూర్ణ ఆహారాన్వేషణ సాగించాలి!


తేలికపాటి ఆహారం!

పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణమవుతాయి. పొట్టు తీయకుండా, పాలిష్‌ పట్టకుండా ఉన్న పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకున్నప్పుడు తేలికగా అరిగి త్వరిత శక్తినిస్తాయి. పాలిష్‌ పట్టిన, నిల్వ ఉంచిన, కృత్రిమ రుచులు జోడించిన పదార్థాలు అజీర్తిని కలిగించి శరీరంలో అగ్నిని రాజేస్తాయి. శక్తిని కణాలకు చేరకుండా చేస్తాయి. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది.

పురుగు మందులు, ఎరువులు వేయకుండా పండించిన సేంద్రీయ పంటల్లో ఖనిజలవణాలు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. వృక్షసంబంధ మాంసకృత్తులు పరిపూర్ణంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన జున్ను, పాలు, పప్పుదినుసులు (కందిపప్పు, మినుములు, పెసలు), కూరగాయలు (చిక్కుళ్లు, పచ్చిబఠాణీ) శక్తిని అందిస్తాయి. 

మంచి రుచికి సరైన దినుసులు తోడైతే, ఆ పదార్థానికి యోగవహి ప్రభావం కలుగుతుంది. ఈ ప్రభావంతో కూడిన ఆహారం తేలికగా జీర్ణమవడంతోపాటు పోషకాలను శరీరానికి తేలికగా అందే మార్గాలను సుగమం చేస్తుంది. మనం ఆహారంలో ఎన్నో రకాల దినుసులను జోడిస్తూ ఉంటాం.

వీటిలో పసుపు శరీరంలోని విషాలను హరించడంతోపాటు రోగనిరోధకశక్తికి సంబంధించిన కణాలకు శక్తినిస్తుంది. జీలకర్ర వేడిని చంపుతుంది. నల్ల మిరియాలు శరీర కణజాలాలకు శక్తి నేరుగా అందేలా మార్గాలను సుగమం చేస్తాయి.


Updated Date - 2020-08-25T05:30:00+05:30 IST