నేషనల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం... ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరు...
ABN , First Publish Date - 2022-04-03T18:29:17+05:30 IST
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం..
ఇస్లామాబాద్: ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం నేషనల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. సభ్యులు మొదట ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పాల్గొనలేదు. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం ఆయన కాసేపట్లో దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీతో సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా ఇమ్రాన్ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ను డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇమ్రాన్ సన్నిహిత మంత్రులు ఫవద్, ఖురేషీ నేషనల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. 342 మంది సభ్యులుగల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ నేతృత్వంలోని పార్టీ పీటీఐ మెజారిటీని కోల్పోయింది. దాదాపు 12 మందికిపైగా సొంత పార్టీ సభ్యులు ఆయనకు జలక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు పంపించారు. వారు ఓటు వేయకుండా నిరోధించేందుకు పీటీఐ కోర్టును ఆశ్రయించింది.