China Investorsకే ప్రాధాన్యం.... స్పష్టం చేసిన Imran Khan
ABN , First Publish Date - 2021-11-21T18:25:40+05:30 IST
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాపార సంస్థలకు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాపార సంస్థలకు గట్టి మద్దతు ప్రకటించారు. తన ప్రభుత్వం చైనా పెట్టుబడిదారులకే పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఇస్లామాబాద్లోని ఛాలెంజ్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన చెన్ యాన్ నేతృత్వంలోని చైనీస్ బిజినెస్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఈ భరోసా ఇచ్చారు.
పాకిస్థాన్, చైనాలు గతం, వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఉంటాయన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య అత్యంత విలువైన సత్సంబంధాలు ఉన్నాయన్నారు. పాకిస్థాన్లో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసే చైనా పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యవసర ప్రాతిపదికపై పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల అనుసంధానం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఒప్పో త్వరలో ఆ దేశంలో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రంను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.