సింగిల్ విండోలో రూ. 16 లక్షలు దుర్వినియోగం
ABN , First Publish Date - 2021-03-09T04:38:51+05:30 IST
మండలంలోని అంబట్పల్లి సింగిల్ విండోలో రూ.16లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు జిల్లా సహకార సంస్థ కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) అధికారులు గుర్తించారు.
- ఆడిట్లో వెలుగు చూసిన సంఘటన
లింగాల, మార్చి 8 : మండలంలోని అంబట్పల్లి సింగిల్ విండోలో రూ.16లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు జిల్లా సహకార సంస్థ కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) అధికారులు గుర్తించారు. మండలకేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో సోమవారం తనిఖీ అధికారులు నారాయణరెడ్డి, పురుషోత్తంరావు ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018-19కి సంబంధించి గత పాలకవర్గం 23మంది బినామీల పేరుతో పంటల రుణాలను తీసుకున్నారని, నకిలీ ఏటీఎం కార్డులను సృష్టించి బ్యాంక్ ద్వారా బినామీలకు తెలియకుండా ఒక్కొక్కరి నుంచి రూ.45వేలను డ్రా చేశారని వారు తెలిపారు. అంతే గాక వైద్యనాథ్ ప్యాకేజీ ద్వారా వచ్చిన వడ్డీ రూ.13లక్షలలో ఎరువుల కొనుగోలుకు సంబంధించి రూ.6లక్షలను మార్క్ఫెడ్కు చెల్లించగా మరో రూ.4లక్షలను ఉద్యోగుల వేతనాలకు చెల్లించినట్లు గుర్తించామన్నారు. కాగా ఎరువులను అమ్మగా వచ్చిన డబ్బులను సైతం కాజేశారని వారు తెలిపారు. బినామీల నుంచి పూర్తి సమాచారం సేకరించామని, ఆడిట్ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.