Gurudwaraపై ఉగ్రవాద దాడులు... ప్రాణ రక్షణ కోసం భారత్ వస్తున్న ఆఫ్ఘన్ సిక్కులు...

ABN , First Publish Date - 2022-06-30T19:28:58+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో గురుద్వారాపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో సిక్కులను భారత్‌కు

Gurudwaraపై ఉగ్రవాద దాడులు... ప్రాణ రక్షణ కోసం భారత్ వస్తున్న ఆఫ్ఘన్ సిక్కులు...

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో గురుద్వారాపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో సిక్కులను భారత్‌కు తరలిస్తున్నారు. మొదటి బృందంలో 11 మంది గురువారం ఢిల్లీ చేరుకోబోతున్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC), ఇండియన్ వరల్డ్ ఫోరం కలిసి వీరిని మన దేశానికి తీసుకొస్తున్నాయి. కాబూల్‌లోని గురుద్వారా దశమేశ్ పిత గురు గోబింద్ సింగ్ కర్టే పర్వాన్‌పై జూన్ 18న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 


ఇండియన్ వరల్డ్ ఫోరం (Indian World Forum) అధ్యక్షుడు పునీత్ చందోక్ (Puneet Chandhok) మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘన్ మైనారిటీలను భారత దేశానికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ వరల్డ్ ఫోరం,   SGPC సమన్వయంతో వీరిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. 


SGPC అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి (Harjinder Singh Dhami) మాట్లాడుతూ, 11 మంది ఆఫ్ఘన్ సిక్కులు (Afghanistan Sikhs) గురువారం న్యూఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సిక్కులను తరలించడం చాలా ముఖ్యమని, అందువల్ల వీరి ప్రయాణ ఖర్చులను SGPC చెల్లిస్తోందని చెప్పారు. జూన్ 18న కాబూల్‌లోని గురుద్వారాపై జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సవిందర్ సింగ్ చితాభస్మాన్ని న్యూఢిల్లీకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోనే ఉన్నారని చెప్పారు. అదే విధంగా ఈ దాడిలో గాయపడిన రక్‌బీర్ సింగ్ కూడా గురువారం న్యూఢిల్లీ చేరుకునే 11 మంది బృందంలో ఉన్నారని చెప్పారు. 


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లోని గురుద్వారా హర్ రాయ్ సాహిబ్‌పై 2020 మార్చిలో ఉగ్రవాద దాడి జరిగింది. అనంతరం వందలాది మంది హిందూ, సిక్కులను ఆ దేశం నుంచి భారత్‌కు తీసుకొచ్చేశారు. అయితే 150 మంది ఇంకా అక్కడే ఉండిపోయారు. జూన్ 18న గురుద్వారాపై ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం 111 మందికి వీసాలు జారీ చేసింది. వీరిని న్యూఢిల్లీకి తీసుకొస్తారు. మరికొందరికి వీసాల జారీ పెండింగ్‌లో ఉంది. 


Updated Date - 2022-06-30T19:28:58+05:30 IST