డిజిటల్ ప్రపంచంలో.. మోదీ బ్రాండ్ ఇమేజ్ @ రూ. 413 కోట్లు
ABN , First Publish Date - 2022-10-02T09:25:14+05:30 IST
దాదాపుగా అన్ని దిగ్గజ సామాజిక మాధ్యమాలు, మైక్రోబ్లాగింగ్ సైట్లలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 1: దాదాపుగా అన్ని దిగ్గజ సామాజిక మాధ్యమాలు, మైక్రోబ్లాగింగ్ సైట్లలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. ఫాలోయర్ల రికార్డులో ప్రపంచ నేతలనే అధిగమించారు. తాజాగా ఆయన మరో అరుదైన రికార్డు సాధించారు. భారత రాజకీయ నాయకుల విభాగంలో డిజిటల్ ప్రపంచంలో అత్యంత గొప్ప బ్రాండ్ ఇమేజ్ను సాధించారు. ట్విటర్, ఫేస్బుక్, గూగుల్ సెర్చ్, ఇన్స్టాగ్రామ్, వికీపీడియా, యూట్యూబ్, గూగుల్ ట్రెండ్స్ తదితర ప్లాట్ఫామ్స్పై రాజకీయ నాయకులు, ప్రముఖ బ్రాండ్లు, సినీ తారలు, క్రికెటర్ల ఉనికి, ఫాలోయర్ల ప్రతిస్పందనలను అనాలసిస్ అండ్ డిజిటల్ ర్యాంకింగ్ సంస్థ ‘చెక్బ్రాండ్’ విశ్లేషించి, వారి బ్రాండ్ ఇమేజ్లను లెక్కగట్టింది. ఇందుకోసం 10 కోట్లకు పైగా ఆన్లైన్ ఇంప్రెషన్లను విశ్లేషించింది. 500 మంది రాజకీయ నాయకుల ప్రొఫైల్స్ను జల్లెడపట్టి.. వారి బ్రాండ్ ఇమేజ్ను అంచనా కట్టింది. ఇలా ప్రధాని మోదీ బ్రాండ్ ఇమేజ్ విలువ రూ. 413కోట్లు అని వెల్లడించింది. ఏడీజీ ఆన్లైన్, చెక్బ్రాండ్ సంస్థల ఎండీ అనూజ్ సయాల్ శనివారం ఈ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘హర్ ఘర్ తిరంగా’’ కాంపెయిన్ తర్వాత మోదీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందన్నారు. కాగా.. చెక్బ్రాండ్ చివరిసారిగా 2020లో బ్రాండ్ విలువల జాబితాను విడుదల చేసింది. అప్పట్లో ప్రధాని మోదీ బ్రాండ్ విలువ రూ. 327 కోట్లు. సాగు చట్టాల కారణంగా ఆయన విలువపై ప్రతికూల ప్రభావం చూపినా ఆ తర్వాత గణనీయంగా పెరిగినట్లు చెక్బ్రాండ్ తెలిపింది. అన్ని బ్రాండ్లు, వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ స్థానం 4. ఆయన కంటే ముందు వరసలో నైక్/నైకీ, సామ్సంగ్ సంస్థలు, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. తాజా జాబితాలో రాజకీయ నాయకుల విభాగంలో రూ.96.8 కోట్లు బ్రాండ్ విలువతో కేంద్ర మంత్రి అమిత్ షా రూ.61.7 కోట్లుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మమతాబెనర్జీ ఈ జాబితాలో చాలా వెనకబడి ఉన్నారు.