YS Jagan Tour : ఆంక్షల పేరుతో.. ఓవర్ యాక్షన్.. సైరన్ లేకుండా CM Convoy
ABN , First Publish Date - 2021-10-08T05:22:29+05:30 IST
పోలీసుల కఠిన ఆంక్షలు.. కొందరి ఓవర్ యాక్షన్తో ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటన పట్టణవాసులను ఇబ్బందుల పాల్జేసిందని కొందరు బహిరంగంగానే విమర్శించారు. స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల క్రీడామైదానంలో ఆసరా 2వ విడత ప్రారంభం కార్యక్రమం ఏర్పాటుచేయగా, పోలీసులు పాఠశాలకు నాలుగువైపులా రోడ్లను దిగ్బంధించారు. దీంతో బుధవారం రాత్రి నుంచి ఆ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా, అడుగుడుగునా పోలీసుల తనిఖీలు, ఆంక్షలతో ప్రజలు పడ్డ అవస్థలు అంతాఇంతా కాదు.
- అడుగడుగున సామాన్యులకు ఇబ్బందులు
- సైరన్ లేకుండా సీఎం కాన్వాయ్
- నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు
ఒంగోలు (కార్పొరేషన్)/(క్రైం), అక్టోబరు7 : పోలీసుల కఠిన ఆంక్షలు.. కొందరి ఓవర్ యాక్షన్తో ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటన పట్టణవాసులను ఇబ్బందుల పాల్జేసిందని కొందరు బహిరంగంగానే విమర్శించారు. స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల క్రీడామైదానంలో ఆసరా 2వ విడత ప్రారంభం కార్యక్రమం ఏర్పాటుచేయగా, పోలీసులు పాఠశాలకు నాలుగువైపులా రోడ్లను దిగ్బంధించారు. దీంతో బుధవారం రాత్రి నుంచి ఆ వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా, అడుగుడుగునా పోలీసుల తనిఖీలు, ఆంక్షలతో ప్రజలు పడ్డ అవస్థలు అంతాఇంతా కాదు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల చర్యలతో గురువారం ఉదయం నుంచి కర్నూలు రోడ్డు జంక్షన్, మంగమూరు రోడ్డు జంక్షన్తో పాటుగా నగరంలో సాయిబాబా గుడి సెంటర్, బండ్లమిట్ట నుంచి రంగారాయుడు చెరువు కట్ట వైపు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. మరోవైపు జగన్ సభా వేదిక విచ్చేసే రోడ్డుమార్గంలో మంగమూరు రోడ్లో దుకాణాలన్నీ మూసివేయడంతోపాటు రాకపోకలు బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తిగా రోడ్డుకు ఇనుప బారికేడ్లు వేయడంతో అక్కడ నివాసం ఉండేవారు బయటకు రాలేకపోయారు. మరోవైపు ఎండ తీవ్రంగా ఉండటంతో సభకు విచ్చేసే మహిళలు,ప్రజలకు మంచినీళ్ళు దొరక్క అల్లాడిపోయారు. స్థానిక కోర్టు సెంటర్ నుంచి వాహనాలను నిలిపివేయడంతో పొదుపు మహిళలను తరలించిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాలినడకన సభకు వెళ్ళేందుకు ప్రయత్నించిన జనాలను పోలీసులు ఆంక్షలు మరింత నిరుత్సాహపరిచాయి.సభను సక్సెస్ చేయాలని వైసీపీ నాయకులు తపన పడగా, పోలీసుల తీరు మాత్రం విమర్శలకు తావిచ్చింది.రెండుగంటల పాటు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండగా, బుధవారం రాత్రి నుంచే ఆంక్షలు అమలుతో గురువారం మధ్యాహ్నం వరకు ప్రజలకు నగరంలో కష్టాలు తప్పలేదు. ఏం సభో ఏమో కానీ మాకు మాత్రం సమస్య అయ్యిందని పలువురు బహిరంగంగానే విమర్శించారు.
ఆంక్షలు సామాన్యులకే..
ముఖ్యమంత్రి పర్వటనలో పోలీసుల ఆంక్షలు అధికంగా ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా మీడియాను కూడా దూరంగా పెట్టారు. అదేక్రమంలో సామాన్యులను సైతం ఇబ్బందులకు గురిచేశారు. అయితే హెలిప్యాడ్ వద్దకు అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అని పోలీసులు చెప్పినప్పటికి కొంతమంది ప్రజాప్రతినిధులను వారితోపాటు ఉన్న చోటా నాయకులను కూడా లోపలికి పంపారు.అదేవిధంగా ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఎలాంటి సైరన్ లేకుండా పరేడ్గ్రౌండ్ నుంచి సభాస్థలికి చేరింది. రోడ్డుమార్గంలో సీఎంకు ఇరుపక్కలా ఉన్న మహిళలకు అభివాదం చేసుకుంటూ సభాప్రాంగణానికి చేరుకున్నారు.
సీఎం పర్యటన సైడ్ లైట్స్..!
- పీవీఆర్కు నాలుగువైపులా రాకపోకలు బంద్
- సభ వద్దకు ఎవరినీ అనుమతించని పోలీసులు
- ఆంక్షల పేరుతో అందరినీ వెనక్కు పంపిన పోలీసులు
- ఉదయం 9 గంటలకే నిండిపోయిన సభా ప్రాంగణం
- విద్యాసంస్థల బస్సులన్నీ జనం తరలింపునకే కేటాయింపు
- పాఠశాలలు, కాలేజీలకు శెలవు ప్రకటించిన యాజమాన్యాలు
- 10-16కు తాడేపల్లిలో బయలుదేరిన జగన్
- 10-53కు సభకు చేరుకున్న ముఖ్యమంత్రి
- జనాలను తరలించేందుకు కార్పొరేటర్లు అత్యుత్సాహం
- ఒక్కొక్కరికి రూ.200 ఇచ్చి మరీ తరలింపు
- మహిళలతో సందడిగా కనిపించిన నగర వీధులు
- అంజయ్యరోడ్, మంగమూరు రోడ్డులోకి ప్రజల రాకపోకలు నిషేధం
-రోడ్ల వెంట మెప్మా ఆధ్వర్యంలోథ్యాంక్స్ సీఎం సర్ ప్లకార్డులు ప్రదర్శన
- మండుటెండలో మంచినీళ్ళ కోసం అల్లాడిన మహిళలు, పోలీసులు
- పోలీసుల తీరుతో 10గంటలకే ఇంటి బాట పట్టిన మహిళలు, జనం
- జనాన్ని అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు బహిరంగ విమర్శలు
- ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో బయట జనం బయటే వెళ్లిపోయారు
- తాగునీరు లేకపోవడంతో మండుటెండలో అల్లాడిన జనం, ఆపై విమర్శలు
- నగరంలో ఎటుచూసినా గంటల కొద్దిట్రాఫిక్ సమస్య..
- ఉక్కపోతతో సభా ప్రాంగణంలో అల్లాడిన జనం
- వినతిపత్రం ఇచ్చేందుకు విచ్చేసిన మాదిగ సంఘం నాయకులు
- అడ్డుకుని బయట నుంచి బయటే పంపేసిన పోలీసులు