ఇన్చార్జ్ తహసీల్దార్ అవకతవకలపై విచారణ
ABN , First Publish Date - 2022-05-27T07:16:32+05:30 IST
తర్లుపాడు ఇన్చార్జ్ తహసీల్దార్ బి.శ్రీనివాస్పై వచ్చిన అవకతవ కలపై మార్కాపురం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి గురువారం విచారించారు.
తర్లుపాడు, మే 26: తర్లుపాడు ఇన్చార్జ్ తహసీల్దార్ బి.శ్రీనివాస్పై వచ్చిన అవకతవ కలపై మార్కాపురం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి గురువారం విచారించారు. ‘ఇన్చార్జ్ తహసీల్దార్ ఇష్టారాజ్యం’ వార్తకు జిల్లా అధికారులు స్పందించి విచారించాల్సిందిగా మార్కాపురం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతిని ఆదేశించారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఆర్డీవో తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను ఆన్లైన్ చేసిన ఫైల్స్ వివరాలను పరిశీలించారు. విచారణ కొస్తున్నట్లు తెలుసుకున్న తహసీల్దార్ రెండు రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇన్చార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫైల్స్ వివరాలను, ఆన్లైన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆర్డీవో తెలిపారు. లక్ష్మక్కపల్లె గ్రామానికి చెందిన దళితుల భూములను శిరాజ్కు ఆన్లైన్ చేసేందుకు తీసిన ఏటీఏ ఫారాలను పరిశీలించారు. దళితుల భూములను వేరే వ్యక్తులకు ఎలా ఆన్లైన్ చేస్తారని ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేసి పైళ్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మక్కపల్లె దళిత భూములపై వెంటనే నివేదిక తయారు చేయాలని డీటీ వెంకటేశ్ను ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లను మార్కాపురం ఆర్డీవో కార్యాలయానికి తీసుకురావాల్సిందిగా డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్ను ఆదేశించారు. అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్కు పంపనున్నట్లు ఆర్డీవో శివజ్యోతి తెలిపారు.