పెరుగుతున్న కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2022-07-02T06:29:30+05:30 IST
పెరుగుతున్న కొవిడ్ కేసులు
తెరుచుకున్న కరోనా ఐసోలేషన వార్డు
ఖమ్మంజిల్లాలో ఒక్కరోజే 14 కేసుల నమోదు
ఖమ్మంకలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, జూలై 1: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు స్థబ్దుగా ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. జిల్లాలో గత నాలుగు నెలలుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలు మాస్కులు, భౌతిక దూరాన్ని మర్చిపోయారు. తాజాగా నాల్గోవిడత కొవిడ్ గత పదిహేను రోజులుగా ప్రారంభమైంది. ఒక్క కేసు నుంచి ప్రారంభమై శుక్రవారం నాటికి 14కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. ఇప్పటి వరకు మూసేసిన కరోనా వార్డును తిరిగి తెరిచారు. కరోనా వార్డులో నలుగురు, చిన్నారుల వార్డుల్లో ఇద్దరు, మహిళావార్డులో మరో ఇద్దరు కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా సోకినప్పటికీ లక్షణాలు అంతగా లేకపోవడం, తీవ్రతరం లేకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
ఇరుజిల్లాల్లో 17మందికి కరోనా
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో శుక్రవారం మొత్తం 700మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 890 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.