శతకాలతో చెలరేగిన స్మృతి, హర్మన్‌.. విండీస్ ముందు భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-12T15:52:28+05:30 IST

మహిళల ప్రపంచ కప్‌‌లో భాగంగా హామిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అదరగొట్టింది.

శతకాలతో చెలరేగిన స్మృతి, హర్మన్‌.. విండీస్ ముందు భారీ లక్ష్యం

హామిల్టన్: మహిళల ప్రపంచ కప్‌‌లో భాగంగా హామిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అదరగొట్టింది. టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధాన(123), హర్మన్‌ప్రీత్ కౌర్(109) శతకాలతో చెలరేగడంతో మిథాలీసేన 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన టీమిండియా.. ప్రత్యర్థి విండీస్ ముందు 318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టుకు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. 78 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పారేసుకుంది. ఓపెనర్ యస్తీక భాటియా(21 బంతుల్లో 31 పరుగులు) కొద్దిపేపు బ్యాట్ ఝలిపించిన.. ఆ తర్వాత ఆమెతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్(05), దీప్తిశర్మ(15) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 


దీంతో భారత జట్టు 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, దీప్తిశర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఈ ద్వయం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. ఈ క్రమంలో 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో స్మృతి మంధాన శతకం నమోదు చేసింది. అనంతరం కొద్దిసేపటికే 123 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగింది. దీంతో ఈ జోడీ 184 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రీచా ఘోష్ మరోసారి నిరాశపరిచింది. కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరింది. మరోవైపు దూసుకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ బాదింది. చివరికి 109 పరుగుల వద్ద హర్మన్ కూడా ఔటైంది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. కరేబియన్ బౌలర్లలో అనీషా మహ్మద్ 2 వికెట్లు తీయగా.. షమిలియా, హేలీ, షకేరా, దిండ్రా, అల్లేన్ తలో వికెట్ పడగొట్టారు.  



Updated Date - 2022-03-12T15:52:28+05:30 IST