ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం
ABN , First Publish Date - 2022-01-22T07:49:38+05:30 IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు నల్లరాతి విగ్రహాన్ని..
125వ జయంతి రోజు ఆవిష్కరణ: మోదీ
సంతోషకరం: అనితా బోస్
న్యూఢిల్లీ/కోల్కతా, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు నల్లరాతి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విగ్రహం పూర్తయ్యేవరకు అదే ప్రదేశంలో హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, నేతాజీ జయంతి రోజైన ఈ నెల 23 (ఆదివారం) దీనిని ఆవిష్కరిస్తామని ట్విటర్ ద్వారా ప్రధాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల నేతాజీ కుమార్తె అనితా బోస్ సంతోషం వ్యక్తం చేశారు. నేతాజీ విగ్రహ ఏర్పాటుకు ఇండియా గేట్ సరైన ప్రదేశమన్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిందని అభిప్రాయపడ్డారు. అయినా.. ఎప్పటికీ విగ్రహం పెట్టకుండా ఉండడం కన్నా ఆలస్యంగానైనా పెట్టడం సంతోషకరమేనన్నారు. మరోవైపు ప్రధాని ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించింది. అయితే తమ శకటాన్ని తిరస్కరించిన వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు. కాగా, నేతాజీ విగ్రహాన్ని 25 అడుగుల ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ జనరల్ అద్వైత గడనాయక్ తెలిపారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచి శిలను తీసుకురానున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో కొందరి కోసమే నిర్మాణాలు: మోదీ
అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఢిల్లీలో కొన్ని కుటుంబాల కోసం మాత్రమే జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం సంకుచిత ఆలోచనలకు తావు లేకుండా జాతి ప్రయోజనాల కోసం నిర్మాణాలు జరుపుతోందని తెలిపారు. పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన సర్క్యూట్ హౌస్ను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు.