జనగణ‘మన’
ABN , First Publish Date - 2022-08-16T06:17:05+05:30 IST
జనగణ‘మన’
అంగరంగ వైభవంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
రెండు జిల్లాల్లో వాడవాడలా వేడుకలు
ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగురవేసిన సీఎం జగన్
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
మచిలీపట్నంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా
దేశభక్తిని చాటిన సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా శకటాలు, విద్యార్థుల వేషధారణ
సేవలకు గుర్తుగా ప్రభుత్వ సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : అవిగవిగో.. తెల్లదొరల బానిస సంకెళ్ల చప్పుళ్లను బద్దలు కొట్టిన జైహింద్ నినాదాలు.. అదిగో.. ఆసేతు హిమాచలానికి స్వేచ్ఛా కుసుమాలు పూయించిన త్రివర్ణ పతాక రెపరెపలు.. ఆ పక్కనే అదిగో.. నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని గుర్తుచేస్తూ వందేమాతరమంటూ గర్జిస్తున్న వేవేల గొంతుకలు.. అక్కడే కనిపిస్తున్నారదిగో.. తెల్లదొరలను తరిమికొట్టిన మహనీయుల త్యాగనిరతిని గుర్తుచేస్తూ ముద్దులొలికే వేషధారణలో భావిభారత పౌరులు.. ఆ చివర అదిగో.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అంతా కలిసి చెయ్యెత్తి జైకొట్టి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నారదిగో.. మూడు రంగుల ముచ్చటైన వెలుగులు.. జనగణమన అంటూ వీనులవిందైన గీతాలాపనలు.. దేశభక్తి నిండిన ఎన్నో గుండెలు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాన స్వేచ్ఛా సిందూరమై, కృష్ణమ్మ కెరటాలై కాంతులీనాయి. వాడవాడలా, వీధివీధినా జాతీయ జెండా రెపరెపలాడింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగ్గా, సీఎం జగన్ జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ దిల్లీరావు, మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండులో ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా జెండా ఎగురవేసి ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించగా, ప్రభుత్వ సిబ్బందికి పురస్కారాల ప్రదానోత్సవంతో పంద్రాగస్టు వేడుకలు మరింత శోభాయమానమయ్యాయి.