70 కోట్ల రికార్డుకు చేరుకున్న వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-09-07T21:53:06+05:30 IST
కోవిడ్ వ్యాక్సినేషన్లో సంచలన రికార్డు సాధించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో సంచలన రికార్డు సాధించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ తెలిపారు. ఈరోజు వరకూ 70 కోట్ల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టు మంగళవారంనాడు ఓ ట్వీట్లో ఆయన చెప్పారు. ఈ రికార్డు సాధనకు కృషి చేసిన హెల్త్ వర్కర్లు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఇంతవరకూ 70 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగామని ఆ ట్వీట్లో పేర్కొంటూ 'సబ్కో వ్యాక్సిన్ ముఫ్త్ వ్యాక్సిన్' అంటూ య్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
కాగా, సోమవారం ఒక్కరోజే కోటి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్వీట్లో ప్రస్తావిస్తూ, సెప్టెంబర్ మాసంలో సాధించిన రికార్డు ఇదని, ఒక్కరోజే కోటి వ్యాక్సినేషన్ల మార్క్ను టచ్ చేశామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్గా దీనిని అభివర్ణించారు. జనవరి 16న ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, మార్చి 1న రెండో ఫేజ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మూడో ఫేజ్ ఏప్రిల్ 1న మొదలైంది. నాలుగో విడతగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మే 1న మొదలైంది.