ఇండియన్ ఎయిర్లైన్స్ల బంపరాఫర్.. చాలా తక్కువ చార్జీలతో UAE వెళ్లే గొప్ప అవకాశం
ABN , First Publish Date - 2021-11-23T17:26:19+05:30 IST
ఈ వారాంతంలో యూఏఈ వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు పలు ఇండియన్ ఎయిర్లైన్స్ బంపరాఫర్ ప్రకటించాయి.
దుబాయ్: ఈ వారాంతంలో యూఏఈ వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు పలు ఇండియన్ ఎయిర్లైన్లు బంపరాఫర్ ప్రకటించాయి. కేవలం వెయ్యి దిర్హమ్స్(సుమారు రూ.20వేలు)తో షార్జా, రాస్ అల్ ఖైమాలకు వెళ్లే గొప్ప అవకాశం కల్పించాయి. కొచ్చి నుంచి యూఏఈకి ఇలా చాలా తక్కువ వ్యయంతో వెళ్లొచ్చు. ఈ వీకెండ్ వరకు కొచ్చి నుంచి దుబాయ్ వన్ వే టికెట్ ధర 1000 నుంచి 2000 దిర్హమ్స్ మధ్య ఉంటుందని ట్రావెల్ ఏజెన్సీలు ప్రకటించాయి. అలాగే కొచ్చి నుంచి షార్జాకు విమాన టికెట్ కేవలం 800 దిర్హమ్స్(రూ.16,229) మాత్రమేనట. ఇక షార్జా నుంచి రిటర్న్ ఫ్లైట్ల చార్జీలు మరింత చౌక. సుమారు 490 దిర్హమ్స్(రూ.9,940)గా ఉండే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు పేర్కొన్నారు.
కొచ్చి నుంచి ఈ రెండు గమ్యస్థానాలకు చార్జీలు తగ్గడానికి ప్రధాన కారణం ఆయా విమానశ్రయాల్లో ల్యాండింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ చార్జీలు తక్కువగా ఉండడమేనని అల్ బడీ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన సురజ్ రమేష్ అనే ట్రావెల్ ఏజెంట్ వెల్లడించారు. అంతేగాక అబుధాబి నుంచి భారత్కు విమాన సర్వీసుల సంఖ్య భారీగా పెరగడం కూడా చార్జీలు తగ్గడానికి మరో కారణమని ఆయన తెలిపారు. ఇక ఇటీవల అబుధాబి నుంచి కేరళకు ఎయిర్ అరేబియా కేవలం 600 దిర్హమ్స్(రూ.12,172)తో విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే విజ్ ఎయిర్ అనే మరో విమాన సంస్థ కూడా న్యూఢిల్లీకి చాలా తక్కువ చార్జీలతో విమానాలు నడపనున్నట్లు తెలిపింది. ఇలా అబుధాబి నుంచి ఇండియాకు రోజురోజుకు కొత్తగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులు వస్తుండడం కూడా చార్జీలు తగ్గడానికి కారణమైందంటూ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.