కరోనా కొత్త వేరియంట్ Omicron ఎఫెక్ట్.. ఈ 12 దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి..

ABN , First Publish Date - 2021-11-27T19:43:13+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ 'ఒమైక్రాన్' శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దీంతో ఈ వేరియంట్ బయటపడిన ఆఫ్రికన్ దేశాల రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కొత్త వేరియంట్ Omicron ఎఫెక్ట్.. ఈ 12 దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి..

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ 'ఒమైక్రాన్' శరవేగంగా వ్యాప్తి  చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దీంతో ఈ వేరియంట్ బయటపడిన ఆఫ్రికన్ దేశాల రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాలతో పాటు వాటితో లింకులున్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కరోనా టెస్టు తప్పనిసరి చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా,  చైనా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్, బోత్స్వానా, మారిషస్, రెండు యూరోప్ దేశాలు ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మొదట దక్షిణాఫ్రికాలో బయటపడినప్పటికీ తాజాగా బోత్స్వానా(3), హాంగ్‌కాంగ్(01)లో కూడా కొత్త కేసులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భారత ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. 


12 దేశాల జాబితాను విడుదల చేయడంతో పాటు ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అటు మహారాష్ట్ర, గుజరాత్ కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక కండీషన్స్ పెట్టాయి. ముంబై వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. అలాగే గుజరాత్ కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసింది. ఇదిలాఉంటే.. ఇప్పటికే పలు దేశాలు ఆఫ్రికన్ దేశాలైన దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, బోత్స్వానా, లెసోతో, ఈశ్వతినికి విమాన సర్వీసులను నిలిపివేశాయి. అలాగే ఆయా దేశాలకు తమ దేశ పౌరులు వెళ్లకుండా నిషేధం కూడా విధించాయి. ఈ జాబితాలో బ్రిటన్, అమెరికా, ఫిలిప్పీన్స్, స్పెయిన్, ఇజ్రాయిల్, ఆస్ట్రియా, మొరాకో, కెనడా, కువైత్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి.    

Updated Date - 2021-11-27T19:43:13+05:30 IST