దయనీయ నిరుపేద స్థితిని భారత్ తుడిచిపెట్టేసింది : ఐఎంఎఫ్

ABN , First Publish Date - 2022-04-07T19:44:04+05:30 IST

దయనీయ నిరుపేద స్థితిని భారత దేశం చాలా వరకు నిర్మూలించిందని

దయనీయ నిరుపేద స్థితిని భారత్ తుడిచిపెట్టేసింది : ఐఎంఎఫ్

న్యూఢిల్లీ : దయనీయ నిరుపేద స్థితిని భారత దేశం చాలా వరకు నిర్మూలించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రచురించిన ఓ వర్కింగ్ పేపర్‌ పేర్కొంది. 40 ఏళ్ళలో రాజ్యం అందజేసిన ఆహార సహాయం ద్వారా వినియోగంలో అసమానతలను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించిందని తెలిపింది. ఈ వర్కింగ్ పేపర్‌ను ఆర్థికవేత్తలు సుర్జీత్ భల్లా, అరవింద్ విర్మానీ, కరణ్ భసిన్ రూపొందించారు. 


అత్యంత దయనీయ పేదరికంలో మగ్గిపోతున్నవారు, దాదాపు 1 శాతం కన్నా తక్కువ మంది, కోవిడ్-19 మహమ్మారి సమయంలో సైతం నిలదొక్కుకున్నారని, రాయితీతో కూడిన దాతృత్వం, ముఖ్యంగా ఆహార సరుకులను ఇవ్వడం వల్ల వీరు ఈ సమయంలో జీవించగలిగారని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ తెలిపింది. 


ఇటీవల వెలువడిన వివిధ అంతర్జాతీయ అధ్యయన నివేదికల్లో, ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల భారత దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదుర్కొన్న ఆర్థిక విపత్తులపై అధ్యయనాల ఫలితాలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. కొనుగోలు శక్తి సమానత్వం (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ)లో 1.9 డాలర్లపై జీవించేవారు కడు నిరుపేదలని ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. దీని ప్రకారం కడు నిరుపేద స్థితిలో ఉన్నవారు మన దేశ జనాభాలో 0.8 శాతం మంది ఉన్నారు. ఈ వివరాలను 2022 ఏప్రిల్ 5న ప్రచురితమైన ఐఎంఎఫ్ పేపర్ వెల్లడించింది. 


మహమ్మారి వేధించిన 2020వ సంవత్సరంలో కడు నిరుపేద స్థితి పెరగకుండా చూడటంలో ఆహార సరుకులు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపింది. కడు పేదరికం అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేందుకు రాయితీతో కూడిన ఆహార సరుకుల సరఫరా దోహదపడిందని పేర్కొంది. 


ఈ పేపర్ రూపకర్తలు మాట్లాడుతూ, భారత దేశం ఆహార రాయితీ పథకాన్ని విస్తరించడం ద్వారా సాంఘిక భద్రత కవచం పరిధి పెరిగినట్లు తమ అధ్యయన ఫలితాలు వెల్లడించాయన్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల సంభవించిన విపత్తులో అత్యధిక భాగం ఈ సాంఘిక భద్రత కవచం పరిధిలోకి వచ్చినట్లు వెల్లడైందన్నారు. పేదరికం రేటు అతి తక్కువగా ఉండటాన్నిబట్టి భారత దేశం కడు నిరుపేద స్థితిని నిర్మూలించినట్లు స్పష్టమవుతోందన్నారు. రాయితీలతో కూడిన సర్దుబాట్ల ప్రభావం పేదరికంపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆహార సహాయం నగదు బదిలీ మాదిరిగా పని చేసి పేదరికానికి కళ్లెం వేసిందని తెలిపారు. 


ఐఎంఎఫ్ వర్కింగ్  పేపర్ రచయితల్లో ఒకరైన భల్లా మాట్లాడుతూ, కడు నిరుపేద స్థితి నిర్మూలన అయినందువల్ల, భారత దేశం 1.9 డాలర్ల పీపీపీ పేదరిక రేఖ నుంచి 3.2 డాలర్ల పేదరిక రేఖకు మారాలన్నారు. దీనివల్ల దారిద్ర్య రేఖ పరిధి ఎక్కువగా ఉంటుందని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని నిర్ణయించేందుకు ఆదాయ పరిమితి పెరుగుతుందని చెప్పారు. ఫలితంగా రాయితీల ప్రయోజనాన్ని పొందేందుకు మరింత ఎక్కువ మంది అర్హులవుతారని తెలిపారు. 


Updated Date - 2022-04-07T19:44:04+05:30 IST