భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం
ABN , First Publish Date - 2022-08-15T09:24:16+05:30 IST
భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యదేశమని, స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
విభిన్న సంస్కృతులకు నిలయం: మంత్రి కేటీఆర్
మూడు వారాల విశ్రాంతి తర్వాత.. మీటింగ్కు హాజరు
అల్వాల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యదేశమని, స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సికింద్రాబాద్ ఆర్మీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న మెగా ఈవెంట్కు ఆదివారం ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. కాలికి గాయం కారణంగా మూడు వారాల విశ్రాంతి తరువాత మొదటిసారిగా ఈవెంట్ కోసం బయటకు వచ్చానని కేటీఆర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన చైనాతో ఇండియాతో పోల్చడాన్ని తాను విభేదిస్తానని చెప్పారు. చైనాలో ఆహార అలవాట్లు, భాష ఒకేలా ఉంటాయి.. కానీ ఇండియాలో ప్రతి 100 కిలోమీటర్ల దూరంలోనే వైవిధ్యభరితమైన మతం, భాష, సంస్కృతి, ఆచారాలు, ఆహార అలవాట్లు మారుతుంటాయని చెప్పారు. అయినప్పటికీ వివిధ భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమన్నారు. విమర్శకులు 75 ఏళ్లలో సాధించాల్సినంత అభివృద్ధి చెందలేదని పేర్కొంటారు.. కానీ వివిధ మతాలు, భాషలు, ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ప్రశంసనీయమని ఆయన అన్నారు.