అరబ్ దేశాలకు 'ఆహార' ఎగుమతుల్లో భారతే టాప్
ABN , First Publish Date - 2021-12-08T13:06:43+05:30 IST
ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత్కు కరోనా కాలం కలిసొచ్చింది. అరబ్ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో బ్రెజిల్ను పక్కకునెట్టి భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
బ్రెజిల్, డిసెంబరు 7: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత్కు కరోనా కాలం కలిసొచ్చింది. అరబ్ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో బ్రెజిల్ను పక్కకునెట్టి భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 2020 సంవత్సరంలో అరబ్ దేశాలు 8.25 శాతం ఆహార ఉత్పత్తులను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. బ్రెజిల్ నుంచి 8.15 శాతం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయి. గడచిన 15 ఏళ్లలో భారత్ ఈ విషయంలో తొలిసారిగా బ్రెజిల్ను అధిగమించడం విశేషం. అరబ్ లీగ్లో మొత్తం 22 దేశాలున్నాయి. పండ్లు, కూరగాయలు, పంచదార, ధాన్యాలు, మాంసం తదితర ఆహార ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాయి. అయితే ఈ దేశాలు బ్రెజిల్కు బాగా దూరంలో ఉండటం, కరోనా నేపథ్యంలో నౌకా రవాణా దెబ్బతినడం వంటి అంశాలు భారత్కు అనుకూలంగా మారాయి. వారంలోనే నౌకల్లో దిగుమతి చేసుకోగలిగే వీలున్నందున.. భారత్ నుంచి ఉత్పత్తుల దిగుమతికి ప్రాధాన్యం ఇస్తున్నారు.