పడి లేచిన నమీబియా.. భారత్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2021-11-09T02:32:01+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు.

పడి లేచిన నమీబియా.. భారత్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. పసికూన నమీబియాను బంతులతో చెడుగుడు ఆడేశారు. మరీ ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా విసిరిన బంతులను ఎదురొడ్డలేక వికెట్లు సమర్పించుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా ఇన్నింగ్స్‌ను దాటిగానే ఆరంభించింది. 


ఓపెనర్ మైఖేల్ వాన్ లింగెన్ (14)ను పెవిలియన్ పంపిన బుమ్రా 33 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత ఒక్క పరుగు జోడించి మరో ఓపెనర్ స్టెఫాన్ బార్డ్ (21) ఔటయ్యాడు. ఇది మొదలు నమీబియా వికెట్లు టపటపా రాలిపోయాయి. బ్యాటర్లు వచ్చినట్టే వచ్చి పెవిలియన్‌ చేరారు. భారత బౌలర్ల జోరు చూసి నమీబియా వంద పరుగులు చేయడం కూడా డౌటే అనుకున్నారు. 


అయితే, డేవిడ్ వీజ్ క్రీజులో పాతుకుపోయి నిప్పులు చెరిగే బంతులను ఎదురొడ్డాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 26 పరుగులు చేయడంతో నమీబియా స్కోరు వంద పరుగులు దాటింది. జాన్ ఫ్రిలింక్ 20 పరుగులు చేయగా, చివరి ఓవర్‌లో రుబెన్ చెలరేగిపోయాడు. 6 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 13 పరుగులు చేయడంతో నమీబియా 132 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. 

Updated Date - 2021-11-09T02:32:01+05:30 IST