కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతి

ABN , First Publish Date - 2022-10-04T08:58:50+05:30 IST

సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ దక్కించుకొన్నా.. వరల్డ్‌కప్‌ ముందు టీమిండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది.

కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతి

సౌతాఫ్రికాతో భారత్‌ మూడో టీ20 నేడు

రాత్రి 7 గం నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో


హోల్కర్‌ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. మైదానం చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో.. టాస్‌ నెగ్గి జట్టు బౌలింగ్‌ ఎంచుకొనే అవకాశం ఉంది. 


ఇండోర్‌: సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ దక్కించుకొన్నా.. వరల్డ్‌కప్‌ ముందు టీమిండియా డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన కొండంత స్కోరు కొట్టినా.. బౌలర్లు తేలిపోవడంతో కష్టంగా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా మంగళవారం జరిగే ఆఖరి టీ20లో భారత బౌలర్లకు కఠిన పరీక్షే. సిరీస్‌ ఫలితం తేలడంతో.. పెద్దగా ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ తుది జట్టులో ఆడే అవకాశం ఉండగా.. సూర్యకుమార్‌, పంత్‌లలో ఒకరు రోహిత్‌తో కలసి ఓపెనింగ్‌ చేయొచ్చు. షాబాజ్‌ అహ్మద్‌, సిరాజ్‌ లేదా ఉమేశ్‌కు చాన్స్‌ దక్కొచ్చు. 


చివరి మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఈనెల 6న ప్రపంచకప్‌ కోసం బయల్దేరే భారత జట్టులో కోహ్లీ, రాహుల్‌ చేరతారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇక, మెగా ఈవెంట్‌ ముందు భారత బ్యాటింగ్‌ గాడిలో పడినట్టుగానే కనిపిస్తోంది. రాహుల్‌ మంచి స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తుండగా.. కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్‌ తనదైన రోజు రెచ్చిపోతుండగా.. సూర్య దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. కాగా, పంత్‌, దినేష్‌ కార్తీక్‌కు తగిన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కావాలి.  


గుబులు రేపుతున్న ‘డెత్‌’

బుమ్రా గైర్హాజరీలో టీమిండియా డెత్‌ బౌలింగ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతడి లేనిలోటు తీర్చే బౌలర్‌ను వెదకాల్సిన అవసరం ఉంది. కొత్త బంతితో దీపక్‌ చాహర్‌ అదరగొడుతున్నా.. స్లాగ్‌ ఓవర్లలో అతడి ప్రదర్శనపై ఇంకా సందేహాలున్నాయి. ఇక, అర్ష్‌దీప్‌ సింగ్‌ కొత్త, పాత బంతితో ఆకట్టుకొంటున్నా.. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హర్షల్‌ పటేల్‌ లయను అందుకోవాల్సి ఉండగా.. మిడిల్‌ ఓవర్లలో అశ్విన్‌ వికెట్లు పడగొట్టడం ఎంతో కీలకం. మరోవైపు సౌతాఫ్రికా సిరీ్‌సను చేజార్చుకొన్నా.. మిల్లర్‌ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ఊరటనిచ్చేదే. అయితే, కెప్టెన్‌ బవుమా బ్యాటిం గ్‌తోపాటు బౌలింగ్‌ విభాగం వైఫల్యం కూడా జట్టును కలవరపెడుతోంది.  .

జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌, సూర్యకుమార్‌, అక్షర్‌, కార్తీక్‌, షాబాజ్‌, హర్షల్‌, దీపక్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.


దక్షిణాఫ్రికా:

బవుమా (కెప్టెన్‌), డికాక్‌, రోసౌ/హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌, పార్నెల్‌, కేశవ్‌, రబాడ, నోకియా, ఎన్‌గిడి. 

Updated Date - 2022-10-04T08:58:50+05:30 IST