Indian economy: భారత్ ఈ ఏడాది వేగవంత వృద్ధిని సాధిస్తుంది.. ప్రభుత్వవర్గాల ఆశాభావం
ABN , First Publish Date - 2022-08-12T02:55:37+05:30 IST
ధరల పెరుగుదల అవరోధాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) ఈ ఏడాది ప్రపంచంలో వేగవంత వృద్ధి రేటుని సాధిస్తుందని కేంద్రప్రభుత్వ(Central Govt) ఉన్నతస్థాయి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ : ధరల పెరుగుదల అవరోధాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ(Indian Economy) ఈ ఏడాది ప్రపంచంలో వేగవంత వృద్ధి రేటుని సాధిస్తుందని కేంద్రప్రభుత్వ(Central Govt) ఉన్నతస్థాయి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ద్రవ్యోల్బణం(inflation) ప్రతికూల స్థాయికి పెరిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ రికవరీ పథంలోనే కొనసాగుతోందని, వృద్ధి నెమ్మదించే అవకాశమే లేదని పేర్కొన్నాయి. సేవల (Services) డిమాండ్, అధిక పారిశ్రామికోత్పత్తి(High Industrial Production) దన్నుతో గణనీయమైన వృద్ధి నమోదవ్వడం ఖాయమని ఆయా వర్గాలు విశ్లేషించాయి. ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం నిరంతరాయంగా చర్యలు తీసుకుంటున్నదని, కేంద్ర బ్యాంక్ ఆర్బీఐతో సంప్రదింపులను కొనసాగిస్తోందని వివరించాయి. కాగా గత 6 వరుస నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ఠ పరిమితి 6 శాతానికి ఎగువనే కొనసాగుతోంది.
వాణిజ్య లోటు పెరిగిపోతుండడంపై స్పందిస్తూ.. సీఏడీ (current account deficit) ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కొనసాగుతోందన్నారు. మరోవైపు రుణ వ్యయాలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ప్రభుత్వవర్గాలు వివరించాయి. ఇక క్రిప్టోకరెన్సీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరించారు. ఇటివల బయటపడిన వజీర్ఎక్స్ ఉదంతం క్రిప్టో లావాదేవీల్లో చీకటి కోణాలను బయటపెట్టిందని ఉదహరించారు. క్యాసినోలపై పన్నుల విషయంపై మంత్రుల బృందం ఆర్థిక మంత్రికి నివేదికను సమర్పించే అవకాశం ఉందన్నారు.