పెట్రోలియం ఎగుమతి దేశాలకు భారత్, అమెరికా ఝలక్

ABN , First Publish Date - 2021-11-24T01:38:10+05:30 IST

పెట్రోలియం ఎగుమతి దేశాల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలనే

పెట్రోలియం ఎగుమతి దేశాలకు భారత్, అమెరికా ఝలక్

న్యూఢిల్లీ : పెట్రోలియం ఎగుమతి దేశాల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో భారత దేశం తన చమురు నిల్వల నుంచి దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ళ చమురును త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇతర దేశాలతో సమన్వయంతో ఈ చర్య చేపట్టబోతున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గడానికి ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు. 


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) దేశాల వైఖరిని ఎదిరించేందుకు భారత్, అమెరికా, ఇతర దేశాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. భారత దేశం తన వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ళ చమురును వచ్చే వారం విడుదల చేయబోతోంది. ఈ నిల్వలు ఉన్న ప్రాంతానికి సమీపంలోని రిఫైనరీలకు సరఫరా చేస్తారు. ఈ చమురు మన దేశంలో ఒక రోజు వినియోగానికి సరిపోతుంది. అయితే ఇలా విడుదల చేయడం వల్ల ఒపెక్ దేశాలకు ఓ సందేశాన్ని పంపినట్లవుతుంది. పెట్రోలియం ఉత్పత్తులను భారీగా ఉపయోగించుకునే ప్రధాన దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలను పంపుతుంది. 


ఒపెక్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తిని పెంచవలసిన అవసరం లేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంగళవారం పేర్కొంది. ప్రధాన వినియోగదారులైన దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇటువంటి ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, జపాన్, దక్షిణ కొరియాల సమన్వయంతో ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. చైనా కూడా తన వద్దనున్న నిల్వల నుంచి కొంత చమురును విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-11-24T01:38:10+05:30 IST