దుబాయ్-భారత్ మధ్య విమాన సర్వీసులు రద్దు
ABN , First Publish Date - 2021-04-23T13:26:09+05:30 IST
భారత్లో కరోనా ఉధృతి అంతర్జాతీయ విమానసర్వీసులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. పలు దేశాలు తమ విమాన సర్వీసులను కుదించడమో, తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తున్నాయి. ప్రయాణికులపైనా ఆంక్షలను విధించాయి. దుబాయ్-భారత్ మఽధ్య విమాన సర్వీసులను ఆదివారం నుంచి 10 రోజులపాటు..
దుబాయ్/మెల్బోర్న్/సింగపూర్/లండన్, ఏప్రిల్ 22: భారత్లో కరోనా ఉధృతి అంతర్జాతీయ విమానసర్వీసులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. పలు దేశాలు తమ విమాన సర్వీసులను కుదించడమో, తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తున్నాయి. ప్రయాణికులపైనా ఆంక్షలను విధించాయి. దుబాయ్-భారత్ మఽధ్య విమాన సర్వీసులను ఆదివారం నుంచి 10 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ఎమిరేట్స్ విమానయానసంస్థ ప్రకటించింది. భారత్ సహా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విమానాలను 30% మేర తగ్గించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. భారత్ సహా హై-రిస్క్ దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరుల సంఖ్యపైనా పరిమితి విధిస్తామని స్పష్టం చేసింది. కాగా, గత 14 రోజులుగా భారత్లో ఉంటూ సింగపూర్ రావాలనుకునే దీర్ఘకాల, తక్కువ కాలవ్యవధి పాస్పోర్టులు ఉన్నవారికి దేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వబోమని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. భారత్ నుంచి వచ్చినవారు 21 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి అదనపు విమానాలు దిగడానికి అనుమతి ఇవ్వబోమని లండన్లోని హీత్రో విమానాశ్రయం స్పష్పంచేసింది. బ్రిటన్ ఇప్పటికే భారత్ను ‘రెడ్లిస్ట్’లో పెట్టిన విషయం తెలిసిందే.
రెడ్లిస్ట్ నిబంధనలు శుక్రవారం నుంచే అమలులోకి వస్తున్నందున అదనంగా 8 విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వాలని నాలుగు అంతర్జాతీయ విమానయాన సంస్థలు పెట్టుకున్న అభ్యర్థనను హీత్రో విమానాశ్రయ అధికారులు తిరస్కరించారు. భారత్ నుంచి వచ్చే బ్రిటిష్, ఐరిష్ పౌరులు 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హెన్కాక్ స్పష్టంచేశారు. కాగా, సెకెండ్ వేవ్ ఉధృతి కారణంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జపాన్ ప్రధాని యుషుహైడ్ సుగ భారత్ పర్కటనను రద్దు చేసుకున్నారు. పాకిస్థాన్, అమెరికా, న్యూజిలాండ్, హాంకాంగ్, ఒమన్, ఫ్రాన్స్ కూడా భారత ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.