గతం కన్నా పటిష్టంగా బ్రిటన్-భారత్ సంబంధాలు : బోరిస్ జాన్సన్
ABN , First Publish Date - 2022-04-22T16:47:36+05:30 IST
బ్రిటన్-భారత్ సంబంధాలు ప్రస్తుతం చాలా పటిష్టంగా
న్యూఢిల్లీ : బ్రిటన్-భారత్ సంబంధాలు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆయన రెండో రోజు భారత్ పర్యటన శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఆయన గుజరాత్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జాన్సన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయన్నారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు భారత దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు స్వాగతం పలికినవారిలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఉన్నారు.
బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాన మంత్రి ఆయనే. శుక్రవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్లో, ‘‘నా మిత్రుడు నరేంద్ర మోదీని నేడు న్యూఢిల్లీలో కలవడం కోసం ఎదురు చూస్తున్నా’’నని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి రంగాల్లో తమ ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలిపారు. నిరంకుశ దేశాల నుంచి ప్రపంచానికి ముప్పు పెరుగుతున్న దశలో ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని తెలిపారు.
మోదీ, జాన్సన్ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ పర్యటనపై జాన్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం వల్ల వచ్చిన అద్భుతమైన ఫలితాలను గుజరాత్లో చూస్తుండటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని గురువారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్లో పేర్కొన్నారు.