సైనా, శ్రీకాంత్కు కష్టమేనా?
ABN , First Publish Date - 2021-05-07T10:22:02+05:30 IST
ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకున్న భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆశలు అనిశ్చితిలో పడ్డాయి.
సన్నగిల్లుతున్న ఒలింపిక్ అర్హత అవకాశం
మలేసియా ఓపెన్లో ఆడడంపై అనిశ్చితి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకున్న భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆశలు అనిశ్చితిలో పడ్డాయి. కారణం మలేసియా ఓపెన్లో భారత షట్లర్లు పాల్గొనడం అనుమానంగా మారడమే. ఈనెల 25 నుంచి మలేసియాలో టోర్నీ జరగాల్సి ఉంది. కానీ, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై మలేసియా నిషేధం విధించింది. విశ్వక్రీడలకు అర్హత సాధించాలంటే సైనా, శ్రీకాంత్ ఆశలన్నీ మలేసియా ఓపెన్తోపాటు వచ్చేనెల 1 నుంచి జరిగే సింగపూర్ ఓపెన్పైనే ఆధారపడి ఉన్నాయి. తాజా ఆంక్షల నేపథ్యంలో సైనా, శ్రీకాంత్ ఒలిం పిక్ అర్హత ఆశలు సంక్లిష్టం కానున్నాయి. జూన్ 15తో బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ ఈవెంట్స్ ముగియనున్నాయి. అంటే, టోక్యో విశ్వ క్రీడలకు అర్హత సాధించేం దుకు పై రెండు టోర్నీలే చివరివి. దీంతో మలేసియా ఓపెన్లో తమ షట్లర్లను అనుమతించాలని కోరుతూ ఆ దేశంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
‘మలేసియా ఓపెన్లో ఆడేలా భారత బ్యాడ్మింటన్ టీమ్ను అనుమతించాలని క్రీడాశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ.. మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వాళ్ల అనుమతి కోసం వేచి చూస్తున్నాం’ అని భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్) ఓ ప్రకటనలో తెలిపింది. సైనా, శ్రీకాంత్తోపాటు ఒలింపిక్ పతక విజేత సింధు, సాయి ప్రణీత్, సాత్విక్, చిరాగ్, అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డి టోర్నీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, సింధు, సాయి ప్రణీత్తోపాటు డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ ఈపాటికే విశ్వక్రీడలకు అర్హత సాధించారు.
స్విస్ వరల్డ్క్పనకు భారత ఆర్చర్లు దూరం
స్విట్జర్లాండ్లో జరగనున్న ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-2లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లకు అనుమతి లభించలేదు. ఈనెల 17 నుంచి 23 లుసాన్నేలో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే, స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్వల్పకాలిక వీసాలకు తిరస్కరించడంతో భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.