భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు Dallas పర్యటన విజయవంతం

ABN , First Publish Date - 2021-11-03T15:00:40+05:30 IST

ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్‌టీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 50 వివిధ భారతీయ సంఘాల నుండి 200కు పైగా నాయకులు హాజరయ్యారు.

భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు Dallas పర్యటన విజయవంతం

డాలస్, టెక్సాస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్‌టీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 50 వివిధ భారతీయ సంఘాల నుండి 200కు పైగా నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమెరికాలో భారత దేశ రాయబారి తరంజిత్ సింగ్ సంధు ముఖ్య అతిధిగా, భారత కాన్సులేట్ అధికారి అసీం మహాజన్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఐఏఎన్‌టీ అధ్యక్షుడు శైలేష్ షా కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌ను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కాన్సులేట్ అధికారులు డాలస్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయులకు అవసరమైన సేవలందించేందుకు తాము ఎల్లప్పుడూసిద్ధంగా ఉంటామని తెలిపారు.


ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథి భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధును సభకు పరిచయం చేస్తూ ప్రసంగించారు. అమెరికా వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న దౌత్యాధికారి, అమెరికా దౌత్య కార్యాలయం, వాషింగ్టన్ డీసీలో మరియు భద్రతా మండలి న్యూయార్క్‌లో గతంలో ఎన్నో సంవత్సరాలుగా పని చేసిన విశేష అనుభవం ఉన్న అధికారి అని పొగిడారు. గతేడాది ఫిబ్రవరిలో అమెరికాలో భారత రాయబారిగా పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి డాలస్ పర్యటన అని, అందుకు భారత రాయబారికి ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 


భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికాలోనే డాలస్ నగరం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని పేర్కొన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో ప్రవాస భారతీయులు అత్యధిక సంఖ్యలో వివిధ రంగాలలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు, వాణిజ్య అభివృద్ధికి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇతోధికంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అలాగే భారతదేశం కూడా ఎంతో ఆసక్తితో అవసరమైన అన్ని అనుమతులను జారీ చేస్తూ ఆర్ధిక సంబంధాల బలోపేతంలో కూడా ముందుకు సాగుతుందన్నారు. జాతీయ సమైక్యత దినంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు.


సభానంతరం రాయబారి తరంజిత్ సింగ్ సందు అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక విగ్రహాన్ని సందర్శించి గాంధీజీకి పుష్పగుచ్చాలనుంచి ఘన నివాళులర్పించారు. ఇంత పెద్ద నిర్మాణం గావించిన మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరను, బోర్డు సభ్యులను, ఇర్వింగ్ పట్టణ అధికారులను ఆయన అభినందించారు. ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు భారత రాయబారి తరంజిత్ సింగ్ సందును ఘనంగా శాలువతో సన్మానించి ఒక జ్ఞాపికను బహుకరించారు. అలాగే ఐఏఎన్‌టీ అధ్యక్షుడు శైలేష్ షా, బోర్డు సభ్యులు కూడా ఆయనను ఘనంగా సన్మానించారు. 










Updated Date - 2021-11-03T15:00:40+05:30 IST