Indian-American: 119 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఇండో-అమెరికన్.. అగ్రరాజ్యంలో భారతీయ మహిళకు దక్కిన అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2022-08-04T15:21:48+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది.
డల్లాస్: అమెరికాలో భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ (Texas)లోని డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (డీఎంఏ) బోర్డు అధ్యక్షురాలిగా ఇండో-అమెరికన్ (Indian-American) గౌరీ నటరాజన్ శర్మ ఎన్నికయ్యారు. 119 ఏళ్ల మ్యూజియం చరిత్రలో శ్వేతజాతీయేతరులు ఈ పదవిని చేపట్టబోతుండడం ఇదే తొలిసారి. 2022-23 ఏడాదికి గాను గతవారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రస్తుత బోర్డు సభ్యులు గౌరీ నటరాజన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పోస్ట్లో కేథరీన్ మార్కస్ రోజ్ ఉన్నారు. 2017 నుంచి డీఎంఏ బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె ప్రస్తుతం కొనుగోళ్లు కమిటీలో మెంబర్గా ఉన్నారు. అలాగే ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా, ప్లానింగ్ కమిటీ కో-చైర్మన్గా విధులు నిర్వహించారు.
అలాగే లెర్నింగ్ అండ్ ఎంగేజ్మెంట్ కమిటీకి అధ్యక్షత వహించారు. యునిసెఫ్ (UNICEF) నార్త్ టెక్సాస్ అండ్ సెంట్రల్ ప్లెయిన్స్ రీజియన్ వ్యవస్థాపక బోర్డు, టెక్సాస్ ఉమెన్స్ ఫౌండేషన్ (టీఎక్స్డబ్ల్యూఎఫ్)లో ఆర్కిడ్ గివింగ్ సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను వ్యవహరిస్తున్నారు. గౌరీకి ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఇక అగ్రరాజ్యంలోని 10 అతిపెద్ద మ్యూజియంలలో డీఎంఏ (DMA) ఒకటి. 119 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియం పగ్గాలు ఇప్పుడు భారతీ మహిళకు దక్కుతుండడం విశేషం. అలాగే 2022-23 ఏడాదికి గాను ఎన్నికైన కొత్త బోర్డులో మరో భారత సంతతి వ్యక్తికి కూడా చోటు దక్కింది. డా. వెణుగోపాల్ మీనన్ ట్రస్టీగా ఎన్నికయ్యారు. ఆయన బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇంతకుముందు ఆయన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ విభాగంలో 24 ఏళ్లు సేవలు అందించారు. 2019లో రిటైర్ అయ్యారు.