ఆర్మీలో చేరేందుకు రాజస్థాన్ యువకుడి సాహసం.. ఏకంగా 350 కిలోమీటర్లు పరుగెత్తి..
ABN , First Publish Date - 2022-04-06T22:53:13+05:30 IST
కోవిడ్ కారణంగా దాదాపు 2 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది.
కోవిడ్ కారణంగా దాదాపు 2 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. దీంతో ఆర్మీలో చేరాలనుకుంటున్న ఎంతో మంది యువకులు రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ నియామకాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ కొన్ని వందల మంది యువకులు నిరసన చేపడుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఈ నిరసనలో పాల్గొనేందుకు రాజస్థాన్కు చెందిన సురేశ్ భిచార్(24) అనే యువకుడు ఏకంగా 350 కిలోమీటర్లు పరిగెత్తాడు. రాజస్థాన్లోని సికార్ నుంచి పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. జాతీయ జెండా పట్టుకుని కేవలం 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. అనంతరం నిరసనలో పాల్గొన్నాడు. మార్చి 29న పరుగును ప్రారంభించాడు. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు ప్రారంభించి 11 గంటల వరకు పరిగెత్తేవాడు. దగ్గర్లోని పెట్రోల్ బంకుకు చేరుకుని విశ్రాంతి తీసుకునేవాడు.
సమీప ప్రాంతంలో ఉన్న ఆర్మీ ఉద్యోగ ఆశావహులను చేరుకుని ఆహారం తీసుకునేవాడు. ఢిల్లీ చేరుకునేందుకు సురేష్ ప్రతీ గంటకు దాదాపు 7 కి.మీలు పరిగెత్తేవాడు. భారత సైన్యంలో చేరాలనుకుంటున్న యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా పరుగు యాత్ర ప్రారంభించానని సురేష్ చెప్పాడు.