ఎయిరిండియా విమాన ప్రమాదం: దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ విచారం
ABN , First Publish Date - 2020-08-08T14:47:31+05:30 IST
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344, ఎక్స్ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి కొజికోడ్లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
దుబాయి: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344, ఎక్స్ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి కొజికోడ్లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. కాన్సుల్ జనరల్ అమన్ పూరీ ఈ ఘటన తనను దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు. ఈ విమానం 184 మంది ప్రయాణికుల(128 మంది పురుషులు, 46 మంది మహిళలు, 10 మంది చిన్నారులు)తో దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు బయల్దేరిందని గుర్తు చేశారు. కోజికోడ్కు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో చేరుకున్న విమానం ప్రమాదానికి గురై రెండు ముక్కలు కావడం షాక్కు గురి చేసిందన్నారు.
ఈ ప్రమాదంలో సీనియర్ పైలట్, మాజీ భారత వైమానిక దళం వింగ్ కమాండర్ కెప్టెన్ దీపక్ వసంత సాతేను కోల్పోవడం ఎంతో బాధకరం అన్నారు. అంతేగాక విమానంలో ఉన్న ప్రయాణికులందరూ అత్యవసర ప్రయాణ కేసులేనని కాన్సుల్ జనరల్ తెలిపారు. వీటిలో కొన్ని వీసా రద్దు మరియు గడువు ముగిసిన కేసులు, కొన్ని వారి కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయాణిస్తున్నాయి, కొన్ని ఉద్యోగం కోల్పోయిన కేసులు, మరికొన్ని వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న కేసులు ఉన్నాయని అమన్ పూరీ పేర్కొన్నారు. కాగా, ప్రయాణీకులు మరియు వారి కుటుంబాల కోసం కాన్సులేట్ 24 గంటలు పనిచేసే నాలుగు హెల్ప్లైన్ నంబర్లను ప్రారంభించిందని తెలిపారు. ఆ హెల్ప్లైన్ నంబర్లు: +971-565463903, +971-543090575, +971-543090571, +971-543090572.