Abu Dhabi Big Ticket లో భారత దంపతులకు జాక్పాట్.. కవలలు పుట్టిన రెండు రోజులకే కలిసొచ్చిన అదృష్టం..!
ABN , First Publish Date - 2021-12-25T16:03:35+05:30 IST
షార్జాలో ఉండే భారత దంపతులకు కవలలు పుట్టిన రెండు రోజులకే జాక్పాట్ తగిలింది. అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.2కోట్లు) గెలుచుకున్నారు.
అబుధాబి: షార్జాలో ఉండే భారత దంపతులకు కవలలు పుట్టిన రెండు రోజులకే జాక్పాట్ తగిలింది. అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్(సుమారు రూ.2కోట్లు) గెలుచుకున్నారు. దీంతో వారికి జీవితంలో మరిచిపోలేని రెండు ఆనందాలు ఒకేసారి వచ్చి చేరినట్లైంది. వివరాల్లోకి వెళ్తే.. షార్జాలో ఉండే బిజేష్ బోస్కు ఈ డిసెంబర్ మాసం బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. బుధవారం రోజు ఆయన భార్య కవలలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు నిర్వహించిన అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో బోస్కు జాక్పాట్ తగిలింది. శుక్రవారం రోజు బోస్ ఆస్పత్రిలో ఉండగా ఆయనకు బిగ్ టికెట్ హోస్ట్ బౌచ్రా నుంచి ఫోన్కాల్ వచ్చింది. వీక్లీ డ్రాలో భాగంగా బోస్ ఒక మిలియన్ దిర్హమ్స్(రూ.2కోట్లు) గెలుచుకున్నట్లు చెప్పారు. అది విన్న బోస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
బోస్ మాట్లాడుతూ.. "రెండు రోజుల ముందు నా భార్య కవలలకు జన్మనివ్వడం, ఆ తర్వాత భారీ జాక్పాట్ తగలడం నిజంగా అద్భుతం. మాకు పుట్టిన కవలలే ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టారు. నా జీవితానికి వారే ఎక్స్ట్రా గుడ్లక్. వారి వల్లే ఇవాళ నా జీవితంలో చూడనంత డబ్బును చూడబోతున్నాను. ప్రస్తుతానికి ఈ భారీ మొత్తం విషయమై ఏమీ ఆలోచించలేదు. లాటరీ టికెట్ను ఇతర కొంతమంది మిత్రులతో కలిసి కొనుగోలు చేశాం. వారికి కొంతభాగం ఇవ్వాలి. ఆ తర్వాత నాకు వచ్చిన వాటాను మంచి పనుల కోసం వినియోగించాలని అనుకుంటున్నాను" అని బోస్ చెప్పుకొచ్చారు.