ఖతార్ వచ్చే భారతీయులకు ఎంబసీ కీలక సూచన!
ABN , First Publish Date - 2021-07-31T13:45:55+05:30 IST
ఖతార్ వచ్చే భారత ప్రవాసులకు ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక సూచన చేసింది. ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం మనోళ్లకు కొన్ని సూచనలు చేసింది.
దోహా: ఖతార్ వచ్చే భారత ప్రవాసులకు ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక సూచన చేసింది. ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాయబార కార్యాలయం మనోళ్లకు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ముఖ్యమైంది భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశపెట్టడం. ట్విటర్ ద్వారా ఎంబసీ చేసిన సూచనలివే..
1. రెసిడెన్సీ పర్మిట్ కలిగి ఉండి, ఖతార్లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకున్నవారు, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు రెండు రోజుల పాటు హోటల్ క్వారంటైన్లో ఉండడం తప్పనిసరి. వీరికి రెండో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు.
2. రెసిడెంట్ పర్మిట్ హోల్డర్లు ఎవరైతే ఖతార్ వెలుపల కరోనా టీకా పొంది, లేదా వ్యాక్సిన్ తీసుకోని వారు, ఖతార్ బయట కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు 10 రోజులు హోటల్ క్వారంటైన్లో ఉండాలి. 3. సందర్శకులు(ఫ్యామిలీ, టూరిస్ట్, వర్క్) ఖతార్ వెలుపల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా 10 రోజుల హోటల్ క్వారంటైన్ తప్పనిసరి.
4. కరోనా టీకా వేసుకోని సందర్శకులకు(ఫ్యామిలీ, టూరిస్ట్, వర్క్, బిజినెస్) ఖతార్లో ఎంట్రీ లేదు.
ఇక ఇతర అప్డేట్ కోసం భారత ప్రయాణికులు ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెబ్సైట్ను డైలీ చూడాలని ఎంబసీ కోరింది. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఖతార్ ప్రయాణానికి సిద్ధం కావాలని సూచించింది. అలాగే ఎయిర్లైన్స్కు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుని జర్నీకి ప్లాన్ చేసుకోవాలని రాయబార కార్యాలయం భారతీయులను కోరింది.