కొత్త స్కిల్స్పై దృష్టిసారించండి.. భారత కార్మికులకు కాన్సుల్ జనరల్ సూచన!
ABN , First Publish Date - 2021-06-13T14:46:39+05:30 IST
కాన్సుల్ జనరల్ అమన్ పూరి రాస్ అల్ ఖైమాలోని భారతీయ కార్మికులకు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత కరోనా సంక్షోభం వల్ల మారిన పరిస్థితుల దృష్ట్యా కొత్త స్కిల్స్పై దృష్టిసారించాలని కోరారు.
రాస్ అల్ ఖైమా: కాన్సుల్ జనరల్ అమన్ పూరి రాస్ అల్ ఖైమాలోని భారతీయ కార్మికులకు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత కరోనా సంక్షోభం వల్ల మారిన పరిస్థితుల దృష్ట్యా కొత్త స్కిల్స్పై దృష్టిసారించాలని కోరారు. దుబాయ్లో ఇండియన్ మిషన్ నిర్వహిస్తున్న 'బ్రేక్ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్' నాల్గో విడత కార్యక్రమంలో భాగంగా అమన్ పురి శుక్రవారం రాస్ అల్ ఖైమాలోని భారతీయ కార్మికులను కలిశారు. రాస్ అల్ ఖైమాలోని డాబర్ ఇండియా క్యాంపస్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమన్ పురి మాట్లాడుతూ.. "మహమ్మారి విలయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు మీకు ఉన్న నైపుణ్యాలకు తోడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం. భవిష్యత్ను దృష్టిలోపెట్టుకుని ఎంతోకొంత జమ చేసుకోవాలి. ప్రతి కార్మికుడికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలి. బ్యాంక్ ఖాతా వల్ల కలిగే ప్రయోజనాలను కార్మికులు తెలుసుకోవాలి. బ్యాంక్ ఖాతాల్లో సేవింగ్స్ మీకు, మీ కుటుంబ సభ్యులకు భవిష్యత్లో ఉపయోగపడతాయి. దీంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఎంతో అవసరం. ఇది మీ ఫ్యామిలీకి భరోసాను కల్పిస్తుంది. యూఏఈలో ఇప్పటికే భారీ సంఖ్యలో భారతీయ కార్మికులు ఉన్నారని, ఇంకా చాలా మంది ఉపాధి కోసం వస్తుంటారని" అమన్ పూరి అన్నారు.