UAE: లంగ్స్ ఫెయిల్.. వారం రోజులు వెంటిలేటర్పైనే.. ఇక బతకడం కష్టం అన్నారు.. కానీ ఈ భారత ప్రవాసుడి విషయంలో..
ABN , First Publish Date - 2022-09-18T18:30:44+05:30 IST
దుబాయ్లో ఉండే ఈ 56 ఏళ్ల భారత ప్రవాసుడి జీవన పోరాటం గురించి తెలిస్తే మెచ్చుకోవాల్సిందే.
దుబాయ్: దుబాయ్లో ఉండే ఈ 56 ఏళ్ల భారత ప్రవాసుడి జీవన పోరాటం గురించి తెలిస్తే మెచ్చుకోవాల్సిందే. రెండు ఉపిరితిత్తులు ఫెయిలై, వారం రోజుల పాటు వెంటిలేటర్పై ఉండి కూడా గుండె నిబ్బరంతో అనారోగ్యాన్ని ఎదరించి బతికాడు. అతడే.. జీఎస్ సునీల్ కుమార్. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తుంటాడు. ఏడాదికి క్రితం అతడు కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. అయితే, ఇటీవల కోవిడ్-19 సంబంధిత సమస్యలు సునీల్ను చుట్టుముట్టాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, న్యుమోనియాతో బాధపడ్డాడు. మెడిసిన్స్ వాడి కూడా ఫలితం లేకుండా పోయింది. జ్వరం తగ్గలేదు.
నాలుగు రోజులు గడిచేసరికి అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిపోయింది. చివరకు మాట్లాడటానికి సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాంతో తోటివారి సహాయంతో ఖుసైస్లోని ఆస్టర్ హాస్పిటల్లో చేరాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. లంగ్స్ రెండు పూర్తిగా పనిచేయడం లేదని వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తుల్లో అధిక మొత్తంలో ద్రవం పేరుకుపోవడంతో అవి విఫలమైనట్లు వైద్యలు తేల్చారు. సీటీ స్కాన్లో అతని ఊపిరితిత్తులు అదనపు ద్రవంతో నిండి ఉన్నా విషయం తేలిసిందని అల్ ఆస్టర్ హాస్పిటల్లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ ముహమ్మద్ షఫీక్ తెలిపారు.
దాంతో అక్కడి వైద్య బృందం వేగంగా అతనిని ఐసీయూ (ICU)కి తరలించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గించడానికి హై-ఫ్లో నాసల్ కాన్యులా (HFNC) ఆక్సిజన్ థెరపీ చేశారు. ఆ సమయంలో వైద్యులు యాంటీబయాటిక్స్, ఇతర మెడిసిన్స్తో అతడికి చికిత్సను కొనసాగించారు. కానీ, సునీల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇంకా దిగజారింది. ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయాయి. అతనికి మధుమేహం కూడా ఉండడంతో రోజురోజుకీ అతడి పరిస్థితి దిగజారుతూనే ఉంది. సునీల్ శ్వాసకోశ వ్యవస్థ సైతం విఫలమైంది. అతని ఊపిరితిత్తులు.. రక్తంలోకి తగినంత ఆక్సిజన్ను పంపలేకపోతున్నాయి. చికిత్స కూడా సునీల్ ప్రధాన అవయవాలు స్పందించడం లేదు. దాంతో వైద్యులు సునీల్ను వెంటిలేటర్పైకి షిఫ్ట్ చేశారు.
వారం రోజుల పాటు వెంటిలేటర్పైనే..
వెంటిలేటర్పైకి మార్చిన కొన్ని రోజుల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిలో కొంచెం మార్పు రావడం వైద్యులు గ్రహించారు. అలా అతడు ఎనిమిది రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్పైనే ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా అతడి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. నెమ్మదిగా తనంతటతానుగా శ్వాసించడం మొదలు కావడంతో వెంటిలేషన్ తొలగించారు. కానీ, ఎనిమిది రోజుల పాటు సునీల్ పోరాడిన తీరు అమోఘమని షఫీక్ మెచ్చుకున్నారు. 'అతని ఆరోగ్యపరిస్థితి చూస్తే కోలుకోవడం కష్టం అనిపించింది. బతకడం దాదాపు అసాధ్యం అనుకున్నాం. కానీ, అతడి గుండె నిబ్బరమే అతడ్ని బతికించింది. అతడి జీవనపోరాటం మాటల్లో చెప్పలేనిది' అంటూ షఫీక్ చెప్పుకొచ్చాడు.