కేంద్రానికి యూఏఈలోని భారత ప్రవాసుల మొర..
ABN , First Publish Date - 2021-02-26T00:46:36+05:30 IST
సొంత ఖర్చులతో స్వదేశంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తమకు భారంగా మారుతుందని, దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని యూఏఈలోని భారత ప్రవాసులు ఇండియన్ గవర్నమెంట్ను కోరారు.
న్యూఢిల్లీ: సొంత ఖర్చులతో స్వదేశంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తమకు భారంగా మారుతుందని, దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని యూఏఈలోని భారత ప్రవాసులు ఇండియన్ గవర్నమెంట్ను కోరారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తున్న తమకు ఇక్కడ మరోసారి పీసీఆర్ టెస్టు కోసం వెచ్చించడం తలకు మించిన భారంగా పరిణమిస్తుందని ప్రవాసులు వాపోయారు. కనుక స్వదేశానికి చేరుకున్న తర్వాత చేసే ఆర్టీ-పీసీఆర్ టెస్టు ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వారు కోరారు. అలాగే 12 ఏళ్ల లోపు పిల్లలకు యూఏఈ, భారత్లో నిర్వహించే పీసీఆర్ టెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు.
ఇక కేంద్రం ఈ నెల 23 నుంచి విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందు టెస్టు చేయించుకున్న కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ను చూపించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అలాగే స్వదేశానికి చేరుకున్న తర్వాత సొంత ఖర్చులతో మరోసారి కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యూఏఈలోని భారత ప్రవాసులు ప్రభుత్వానికి వీటి నుంచి తమకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉపాధి కోల్పోయి స్వదేశానికి చేరుకుంటున్న ప్రవాసులకు ఇక్కడ నిర్వహించే కరోనా టెస్టు వ్యయం వారికి అదనపు భారంగా మారుతుందని ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత అష్రఫ్ తమరాసేరి అన్నారు.