Mahzooz draw: ఇంత భారీ మొత్తం గెలుస్తానని ఊహించలేదు.. విజేతనని తెలిసినప్పటి నుంచి సరిగ్గా నిద్ర పట్టడంలేదు.. భారత ప్రవాసుడు
ABN , First Publish Date - 2022-07-28T14:29:34+05:30 IST
ఉపాధి కోసం దుబాయ్ (Dubai) వెళ్లిన భారత ప్రవాసుడికి మహజూజ్ రాఫెల్ (Mahzooz Raffale) రూపంలో అదృష్టం వరించింది.
అబుదాబి: ఉపాధి కోసం దుబాయ్ (Dubai) వెళ్లిన భారత ప్రవాసుడికి మహజూజ్ రాఫెల్ (Mahzooz Raffale) రూపంలో అదృష్టం వరించింది. పదేళ్లుగా అక్కడ లేబర్గా (manual labourer) పనిచేస్తున్న రామనాగిన (44) అనే భారతీయ వ్యక్తికి తాజాగా నిర్వహించిన 86వ మహజూజ్ డ్రా (Mahzooz draw)లో జాక్పాట్ తగిలింది. ఏకంగా 1లక్ష దిర్హమ్స్(రూ.21లక్షలు) గెలుచుకున్నాడు. ఒకేసారి ఇంత భారీ మొత్తం గెలవడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. తాజా డ్రాలో తాను విజేతగా నిలిచిన విషయాన్ని తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న రామనాగిన మొదట నమ్మలేదట. ఏదో ఆట పట్టిస్తున్నాడని అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత నిజంగానే తాను భారీ నగదు గెలుచుకున్నట్లు నిర్ధారణ కావడంతో రామనాగిన ఆనందంతో గంతేసినంత పని చేశాడని అతని స్నేహితులు తెలిపారు. మిత్రుల సలహా మేరకే ఈ ఏడాది జనవరి నుంచి మహజూజ్ డ్రాలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నట్లు ఈ సందర్భంగా రామనాగిన వెల్లడించాడు. ఇంత భారీ మొత్తం గెలుస్తానని అస్సలు ఊహించలేదని చెప్పిన అతడు.. ఒకేసారి అంతా భారీ నగదు రావడంతో దాంతో ఏం చేయాలో ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చాడు.
"నేను చాలా అదృష్టవంతుడిని. నా సహోద్యోగుల ద్వారా మహజూజ్ (Mahzooz) గురించి తెలుసుకున్నాను. జనవరి 2022 నుండి తరచూ డ్రాలో పాల్గొంటున్నాను. కానీ నేను ఇంత గొప్ప బహుమతిని ఇంటికి తీసుకువెళతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇంత భారీ మొత్తం గెలిచానని తెలుసుకున్నప్పటి నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. కల లేక నిజం అనేది ఇప్పటికి అర్థం కావడం లేదు. ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఈ అద్భుతమైన బహుమతికి నేను మహజూజ్కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నిస్సందేహంగా నా జీవితాన్ని మార్చేస్తుంది" అని రామనాగిన అన్నాడు. ఇక ఇదే డ్రాలో దాయాది పాకిస్థాన్కు చెందిన మరో ఇద్దరు ప్రవాసులు కూడా చెరో లక్ష దిర్హమ్స్ గెలుకున్నారు.