Makkah లో వంటపై నిషేధం.. భారతీయ యాత్రికుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2022-06-29T14:09:07+05:30 IST

వచ్చే నెలలో జరిగే హజ్‌యాత్ర కోసం సౌదీఅరేబియాలోని మక్కా పుణ్యక్షేత్రానికి చేరుకున్న వేలాది మంది భారతీయులు భోజన సమస్యను ఎదుర్కొంటున్నారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ వంట పొయ్యిలను తొలగించారు. వంట చేయడంపై ఇక్కడ అనేక ఆంక్షలు విధించారు. దాంతో వారు వంటచేసుకోవడానికి వీలుకాక ఆకలితో అల్లాడుతున్నారు.

Makkah లో వంటపై నిషేధం.. భారతీయ యాత్రికుల ఆకలి కేకలు

తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది హజ్‌ యాత్రికులు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ప్రతినిధి): వచ్చే నెలలో జరిగే హజ్‌యాత్ర కోసం సౌదీఅరేబియాలోని మక్కా పుణ్యక్షేత్రానికి  చేరుకున్న వేలాది మంది భారతీయులు భోజన సమస్యను ఎదుర్కొంటున్నారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ వంట పొయ్యిలను తొలగించారు. వంట చేయడంపై ఇక్కడ అనేక ఆంక్షలు విధించారు. దాంతో వారు వంటచేసుకోవడానికి వీలుకాక ఆకలితో అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి 3,500 మంది యాత్రికులు వస్తున్నారు. మక్కాలోని హరం మసీదుకు దూరంగా ఆజీజీయా అనే ప్రాంతంలో భారతీయుల కోసం  కేంద్ర ప్రభుత్వం అపార్ట్‌మెంట్‌లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకుంది.


వాటిలో వంట చేయడానికి అనుమతి పొందింది. అయితే, కొందరు యాత్రికులు నిర్దేశించిన వంట గదులలో కాకుండ తాముంటున్న గదులలో వంట చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు  గత రెండు రోజులుగా  అన్ని ఫ్లాట్లలోని పొయ్యిలను  తొలగిస్తున్నారు. పొయ్యిలూ, భారతీయ హోటళ్లూ లేకపోవడంతో వారంతా ఆకలి  తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.  భారతీయ ఆహారపు అలవాట్లకు అనువుగా ఇక్కడ తిండి దొరక్కపోవడం పెద్దసమస్యగా మారింది. భారతీయ యాత్రికుల క్యాంపులలో వంట చేసుకోవడం ద్వైపాక్షిక ఒప్పందంలో ఒక భాగం. అందువల్ల వంటకు అనుమతి పొందడానికి సౌదీలోని భారతీయ దౌత్యవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2022-06-29T14:09:07+05:30 IST