కువైటీ ఫ్యామిలీపై ఇండియన్ పనిమనిషి రివెంజ్.. అనుమానంతో కిచెన్లో యజమాని పెట్టిన సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు!
ABN , First Publish Date - 2022-03-16T14:29:13+05:30 IST
ఇండియన్ పనిమనిషి ఓ కువైటీ ఫ్యామిలీపై ప్రతీకారంతో చేసిన వికారమైన పని తాజాగా వెలుగులోకి వచ్చింది.
కువైత్ సిటీ: ఇండియన్ పనిమనిషి ఓ కువైటీ ఫ్యామిలీపై ప్రతీకారంతో చేసిన వికారమైన పని తాజాగా వెలుగులోకి వచ్చింది. గడిచిన ఏడాది కాలంగా ఆమె ఆ కువైటీ కుటుంబం కోసం చేస్తున్న ఆహారంలో మురికి నీటిని కలుపుతున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా తాము తింటున్న ఆహార పదార్థాలు రుచిలో వేరుగా ఉండడంతో పాటు ఏదో దుర్వాసన వస్తుండటంతో ఫ్యామిలీ పెద్దకు పనిమనిషిపై అనుమానం వచ్చింది. దాంతో ఆమెకు తెలియకుండా కిచెన్లో సీసీటీవీ కెమెరాను అమర్చాడు. ఆ విషయం తెలియని పనిమనిషి ఎప్పటిలాగే మురికి నీటిని ఉపయోగించి వంటలు చేయడం కెమెరాలో రికార్డైంది. ఆ దృశ్యాలు చూసి కువైటీ ఫ్యామిలీ షాక్ అయింది.
ఇన్నాళ్లు తాము తింటున్న ఆహార పదార్థాలు, తాగుతున్న పానీయాలు మురికి నీటితో తయారవుతుండడం చూసి వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులకు పనిమనిషి కిచెన్లో చేస్తున్న వికారమైన పనికి సంబంధించిన వీడియో క్లిప్ను చూపించారు. దాంతో సదరు పనిమనిషిని ఈ విషయమై ప్రశ్నించగా షాకింగ్ సమాధానం చెప్పింది. తనకు ఉండటానికి ఇంటి రూఫ్పై ఇచ్చిన రూమ్ ఏమాత్రం బాగులేదని, అందుకే కువైటీ కుటుంబంపై కోపంతో ఆ పనిచేసినట్లు అంగీకరించింది. దీంతో క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబిదిన్ భారతీయ పనిమనిషిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఆమెపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేశారు.