ఫైనల్ పోరుకు భారత పురుషులు
ABN , First Publish Date - 2022-05-19T10:27:07+05:30 IST
వరల్డ్కప్ స్టేజ్-2లో భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు సంచలన విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది.
కాంస్యం నెగ్గిన మహిళలు
ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-2
గ్వాంగ్జూ (కొరియా): వరల్డ్కప్ స్టేజ్-2లో భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు సంచలన విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది. కనీసం రజతాన్ని ఖాయం చేసుకోగా.. మహిళల జట్టు కాంస్యం గెలిచింది. క్వార్టర్స్లో వరల్డ్ నం:1 అమెరికాకు ఝలక్ ఇచ్చిన అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్లతో కూడిన భారత జట్టు.. సెమీస్లో ఆర్చరీ పవర్హౌస్ కొరియాపై ఉత్కంఠ విజయం సాధించింది. ఈ జట్టు స్వర్ణం కోసం ఫ్రాన్స్తో తలపడనుంది. బుధవారం జరిగిన రౌండ్-8లో భారత్ 234-228తో అమెరికాను చిత్తు చేసింది. సెమీస్లో కొరియాతో హోరాహోరీగా సాగిన పోరులో 233-233తో స్కోరు సమం కాగా.. షూటాఫ్లో భారత్ 29-26తో గెలిచింది. అవనీత్ కౌర్, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జార్లతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు సెమీస్లో 228-230తో కొరియా చేతిలో ఓడింది. కానీ, కాంస్య పోరులో భారత్ 232-231తో టర్కీపై విజయం సాధించింది.