విశాఖలో ఏఎల్హెచ్ స్క్వాడ్రన్ 324 ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-05T08:22:08+05:30 IST
విశాఖలో ఏఎల్హెచ్ స్క్వాడ్రన్ 324 ప్రారంభం
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 324 విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగాలో సోమవారం ప్రారంభమైంది. తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా సమక్షంలో దీనిని కమిషనింగ్ చేశారు. ఈ స్క్వాడ్రన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్) ఎంకే-3 (ఎంఆర్)లను ఉపయోగిస్తుంది. వీటికి ‘కెస్ట్రెల్స్’ అని పక్షి జాతి పేరు పెట్టారు. గగనతలంలో విహరిస్తూ కింద ఏమున్నా గమనించడం, వెంటాడి వేటాడడం వీటి లక్షణం. విశాలమైన సముద్రంలో నిఘా, గాలింపు, రక్షణ (రెస్క్యూ) ఈ స్క్వాడ్రన్ లక్ష్యం. ఈ హెలికాప్టర్లను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మెరైన్ కమెండోలతో పనిచేసే వీటిని ఎయిర్ అంబులెన్స్లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తూర్పు తీరంలో ప్రారంభమైన తొలి స్క్వాడ్రన్కు కమాండర్ ఎస్ఎస్ దాస్ సారథ్యం వహించనున్నారు.