భారత సంతతి వ్యక్తిని మరణదండన నుంచి కాపాడిన కరోనా!
ABN , First Publish Date - 2021-11-11T02:58:29+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న కరోనా.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోకుండా చేసింది. మరికొంత కాలంపాటు భూమిపై నివసించేందుకు ఆ వ్యక్తికి అవకాశం కరోనా ఏంటి.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోకుండా అడ్డుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నా
ఎన్నారై డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న కరోనా.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోకుండా చేసింది. మరికొంత కాలంపాటు భూమిపై నివసించేందుకు ఆ వ్యక్తికి అవకాశం కల్పించింది. కరోనా ఏంటి.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోకుండా అడ్డుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఈ నమ్మలేని నిజానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత సంతతికి నాగేంద్రన్ ధర్మలింగానికి డ్రగ్స్ రవాణా కేసులో సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం రోజు అతడికి ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో తన మానసిక స్థితి బాగా లేనందున మరణశిక్ష నిలిపివేయాలంటూ ధర్మలింగం తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. వాటిని తోసిపుచ్చిన న్యాయస్థానం అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం మలేసియా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నాగేంద్రన్ ధర్మలింగం కొవిడ్ 19 బారినపడ్డాడు. దీంతో ఆ విషయాన్ని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బుధవారం రోజు అమలు కావాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. మానవతా దృక్పథంతో కొవిడ్ బాధపడుతున్న వ్యక్తికి ఉరిశిక్షను అమలు చేయలేమని జడ్జి జస్టిన్ అండ్రూ ఫాంగ్ అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. మలేషియాలో ఉంటున్న నాగేంద్రన్.. 2009లో సింగపూర్లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో మానసిక వికలాంగుడైన నాగేంద్రన్కు మరణశిక్షను రద్దు చేసి, క్షమాభిక్ష ప్రసాదించాలని సింగపూర్ అధ్యక్షుడిని అతడి కుటంబ సభ్యులు అభ్యర్థించారు. అయితే దాన్ని సింగపూర్ అధ్యక్షుడు నిరాకరించారు. ఈ క్రమంలో బుధవారం నాగేంద్రన్కు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా మరణదండన తాత్కాలికంగా నిలిచిపోయింది.