Singapore: చివరి కోరిక తీర్చి.. భారత సంతతి వ్యక్తిని ఉరితీసిన అధికారులు..!

ABN , First Publish Date - 2022-04-27T14:42:23+05:30 IST

భారత సంతతి వ్యక్తిని సింగపూర్ అధికారులు ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేశారు.

Singapore: చివరి కోరిక తీర్చి.. భారత సంతతి వ్యక్తిని ఉరితీసిన అధికారులు..!

సింగపూర్ సిటీ: భారత సంతతి వ్యక్తిని సింగపూర్ అధికారులు ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేశారు. డ్రగ్ కేసులో పట్టుబడి పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న నాగేంద్రన్ ధర్మలింగంను ఉరి తీసినట్లు అతడి కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే, ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చారు. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత  అతడికి మరణశిక్షను అమలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్​లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది  నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 


అయితే, మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్​తో బాధపడుతున్నట్లు సమాచారం) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యురోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు అప్పీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను గత బుధవారం కొట్టేసింది. న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్ చివరి నిమిషంలో అతడి దరఖాస్తును తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు "కోర్టు చివరి మాట అంటే చివరి మాటే" అని అన్నారు. 


అలాగే బుధవారం(ఏప్రిల్ 27) ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. ఆ సమయంలో నాగేంద్రన్ తన చివరి కోరికను న్యాయస్థానం ముందు ఉంచాడు. "చివరిసారిగా నా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని నేను కోరుకుంటున్నాను" అని తెలిపాడు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం ఇవాళ ఉరి తీయడానికి ముందు అతడిని ఫ్యామిలీతో గడపడానికి కొంత సమయం ఇచ్చింది. దాంతో అధికారులు బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో నాగేంద్రన్‌ను కల్పించారు. ఆ తర్వాత కోర్టు చెప్పిన సమయానికి ఉరి తీయడం జరిగింది. అతని సోదరుడు నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉరిశిక్ష అమలు చేశారని, మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు.




Updated Date - 2022-04-27T14:42:23+05:30 IST