పనిమనిషిని హింసించి ఆమె ప్రాణాలు తీసిన భారత సంతతి మహిళ
ABN , First Publish Date - 2021-02-24T14:59:30+05:30 IST
పనిమనిషి మరణానికి కారణం తానేనంటూ భారత సంతతికి చెందిన మహిళ సింగపూర్ కోర్టులో నేరాన్ని అంగీకరించింది
సింగపూర్: పనిమనిషి మరణానికి కారణం తానేనంటూ భారత సంతతికి చెందిన మహిళ సింగపూర్ కోర్టులో నేరాన్ని అంగీకరించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి మురుగయాన్ అనే భారత సంతతికి చెందిన మహిళ ఇంట్లో పనిచేసిన మయన్మార్కు చెందిన పియాంగ్(40) అనే మహిళ మెదడుకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. గాయత్రి హింసించడం కారణంగానే పియాంగ్ మరణించినట్టు పోస్ట్మార్టం రిపోర్టులు చెబుతున్నాయి. పియాంగ్ ఒంటిపై 50కు పైగా గాయాలు ఉన్నట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది.
గాయత్రి పియాంగ్కు కనీసం భోజనం కూడా పెట్టకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ వచ్చినట్టు అధికారులు తెలుసుకున్నారు. పియాంగ్తో చాకిరీ చేయించుకుని, ఆమెకు తిండి పెట్టకుండా గాయత్రి నరకం చూపించింది. తనకు తెలియకుండా భోజనం చేస్తుందేమోనని పియాంగ్ను కిటికీకి కట్టేసి రాక్షసానందం పొందుతూ వచ్చింది. గాయత్రి కారణంగా పియాంగ్ మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు కూడా ఆవేదనకు గురయ్యారు.
పియాంగ్ మరణించే సమయానికి ఆమె బరువు కేవలం 24 కేజీలే అని వైద్యులు తెలిపారు. మెదడుకు గాయం కాకపోయినా పోషక స్థితి క్షీణించడం వల్ల ఆమె కొద్దిరోజుల్లో మరణించి ఉండేదని వైద్యులు పేర్కొన్నారు. కాగా.. పియాంగ్పై దాడి చేసింది తానేనని, ఆమె చావుకు కారణం కూడా తానేనంటూ గాయత్రి కోర్టులో నేరాన్ని అంగీకరించింది. కోర్టు ఆమెకు జీవితఖైదు విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.