Andhra Pradesh: 27వేల నకిలీ కువైత్ వీసాలు.. ఏపీలో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు..

ABN , First Publish Date - 2022-08-10T15:35:51+05:30 IST

ఉన్న ఊరిలో ఉపాధి కరువై విదేశాలకు వెళ్తున్న వారి అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు ఏజెంట్లు భారీగా మోసానికి పాల్పడుతున్నారు.

Andhra Pradesh: 27వేల నకిలీ కువైత్ వీసాలు.. ఏపీలో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు..

అమరావతి: ఉన్న ఊరిలో ఉపాధి కరువై విదేశాలకు వెళ్తున్న వారి అవసరాలను ఆసరాగా తీసుకుని కొందరు ఏజెంట్లు భారీగా మోసానికి పాల్పడుతున్నారు. నకిలీ వీసాలతో విదేశాలకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తేగానీ బాధితులకు తెలియడం లేదు, తాము మోసపోయామని. అప్పుడు మళ్లీ వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు మరికొంత వసూలు చేస్తున్నారు. ఇలా అమాయకులను ఏజెంట్లు భారీగా మోసగిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇదే కోవలో భారీ మోసం బయటపడింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 22 వరకు ఏకంగా 27వేల నకిలీ వీసాలు సృష్టించి వాటితో జనాలను కువైత్ పంపించినట్లు తెలిసింది. ఈ నాలుగు నెలల వ్యవధిలో ఏపీ నుంచి మొత్తం 37, 208 మంది కువైత్ వెళ్లగా వాటిలో 27వేల వీసాలు నకిలీవిగా పోలీసులు గుర్తించారు. ఈ వీసాలతో కువైత్ వెళ్లిన వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకోవడం, వారి వద్ద ఉన్న వీసాలు నకిలీవి అని చెప్పడంతో తాము మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. 



అక్కడి నుంచి తిరిగి స్వదేశానికి రప్పించేందుకు వారిని నుంచి ఏజెంట్లు మరికొంత వసూలు చేస్తున్నారు. ఇలా అమాయకులను ఏజెంట్లు నట్టింట ముంచుతున్నారు. ప్రకాశం పోలీసు సూపరింటెండెంట్ మల్లిక గార్గ్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు అమాయకులను మోసం చేసి కూవైత్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్తున్న కార్మికులు తీరా అక్కడికివెళ్లి మోసపోయామని తెలుసుకుని తిరిగి స్వదేశానికి వచ్చేందుకు మళ్లీ తమను అక్కడికి పంపిన ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారని మల్లిక గార్గ్ అన్నారు. చెల్లుబాటు అయ్యే వర్క్ వీసాలపైనే విదేశాలకు ఉద్యోగానికి వెళ్లాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. గల్ఫ్ దేశాల్లో పని పేరుతో మోసం చేసే వ్యక్తులపై అనుమానాస్పద ఏజెంట్లపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని దీనికోసం +91 9121102104కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.

Updated Date - 2022-08-10T15:35:51+05:30 IST