నో ఫియర్స్.. షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికాకు భారత జట్టు
ABN , First Publish Date - 2021-11-30T23:12:26+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతున్నప్పటికీ భారత్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుందని, ప్రస్తుతానికైతే..
న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతున్నప్పటికీ భారత్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుందని, ప్రస్తుతానికైతే షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. కివీస్తో డిసెంబరు 3న ముంబైలో రెండో టెస్టు ప్రారంభం అవుతుంది.
ఇది ముగిసిన వెంటనే డిసెంబరు 8 లేదంటే 9న భారత జట్టు జొహన్నెస్బర్గ్కు బయలుదేరుతుంది. సఫారీలతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20ల్లో తలపడుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత ఎ జట్టును భారత ప్రభుత్వం వెనక్కి పిలవలేదు. దక్షిణాఫ్రికా ఎ జట్టుతో భారత జూనియర్ జట్టు మూడు అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచుల్లో తలపడుతోంది.
తమ దేశంలో పర్యటించే భారత జట్టుకు సురక్షితమైన బయోబబుల్ కల్పిస్తామని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వ హామీపై ధుమాల్ స్పందిస్తూ.. తాము క్రికెట్ సౌతాఫ్రికాతోనే ఉంటామన్నారు. ఆటగాళ్ల భద్రత విషయంలో తాము రాజీపడబోమని తేల్చి చెప్పారు. ఆటగాళ్లు షెడ్యూల్ ప్రకారమే చార్టర్డ్ విమానంలో జొహన్నెస్బర్గ్ చేరుకుంటారని, అక్కడ బయోబబుల్లో ఉంటారని తెలిపారు. అయితే, అంతిమంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.