ICC Women's World Cup: అమ్మాయిలు భళా.. బోణీ కొట్టిన టీమిండియా!
ABN , First Publish Date - 2022-03-06T19:03:01+05:30 IST
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించింది.
బే ఓవల్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించింది. భారత్ విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పాక్ జట్టు బోల్తా పడింది. భారత బౌలర్లు విజృంభించడంతో 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్(67), స్నేహరాణా(53), స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40) రాణించారు. అనంతరం 245 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా పయనించలేదు.
వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడంతో 98 పరుగులకే కీలకమైన 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సిద్రా అమీన్(30) పరుగులతో కొద్దిసేపు ప్రతిఘటించిన ఆమెకు తోడుగా ఎవరూ నిలవలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి చివరకు దాయాది జట్టు 137 పరుగులకు చేతులేత్తేసింది. దీంతో టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీయగా.. ఝులన్ గోస్వామి, స్నేహరాణా తలో రెండు వికెట్లు.. దీప్తి శర్మ, మేఘన సింగ్ చెరో ఒక వికెట్ తీశారు. 67 పరుగులతో భారత ఇన్నింగ్స్ను నిలబెట్టిన పూజా వస్త్రాకర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది.