ఉక్రెయిన్ సైన్యంలో తమిళ యువకుడు
ABN , First Publish Date - 2022-03-09T13:11:06+05:30 IST
ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో తమిళనాడు యువకుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరడం సంచలనం రేపుతోంది. కోయంబత్తూరు జిల్లా సుబ్రమణ్యపాళ్యంకు చెందిన రవి
రెండుసార్లు తిరస్కరించిన భారత ఆర్మీ
చెన్నై, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో తమిళనాడు యువకుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరడం సంచలనం రేపుతోంది. కోయంబత్తూరు జిల్లా సుబ్రమణ్యపాళ్యంకు చెందిన రవిచంద్రన్, ఝాన్సీలక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు సాయినికేశ్(22) 2018లో ఖార్కివ్లోని నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ రీసెర్చ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం కోసం వెళ్లాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. యుద్ధం నేపథ్యంలో సాయి నికేశ్ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఈ విష యం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు కోయంబత్తూరుకు వెళ్లి, ఆ యువకుడి తల్లిదండ్రుల వివరాలు, నేపథ్యం గురించి ఆరా తీశారు.
కోయంబత్తూరులోని ప్రైవేటు పాఠశాలలో 2018లో ప్లస్ టూ పూర్తిచేసిన సాయి నికేశ్కు చిన్నవయసు నుంచే సైన్యంలో చేరాలన్న ఆసక్తి ఉండేది. భారత ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించినా ఎత్తు తక్కువగా ఉందంటూ అధికారులు రెండుసార్లు తిరస్కరించారు. దీంతో ఉక్రెయిన్ వెళ్లి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. యుద్ధం ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు పార్ట్టైమ్ జాబ్లో చేరానని, వీడియోగేమ్ డెవల్పమెంట్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపాడు. ఆ తరువాత ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్టు తేలింది. కేంద్రం చొరవ తీసుకుని తమ బిడ్డను ఇంటికి చేర్చాలంటూ సాయి నికేశ్ తల్లిదండ్రులు రవిచంద్రన్, ఝాన్సీలక్ష్మి బోరున విలపించారు. కాగా, భారత్, అమెరికా, యూకే, స్వీడన్, లిథువేనియా, మెక్సికో దేశాల నుంచి 20,000 మంది ఇప్పటిదాకా తమ సైన్యంలో చేరారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.