నేటి నుంచి Singapore వెళ్లేందుకు భారతీయులకు అనుమతి.. కొత్త రూల్స్ ఇవే!

ABN , First Publish Date - 2021-10-27T00:35:35+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో పలు దేశాలు భారతీయుల రాకపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

నేటి నుంచి Singapore వెళ్లేందుకు భారతీయులకు అనుమతి.. కొత్త రూల్స్ ఇవే!

సింగపూర్ సిటీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో పలు దేశాలు భారతీయుల రాకపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటిలో సింగపూర్ కూడా ఉంది. అయితే, గతవారం భారత్‌పై ఉన్న ప్రయాణ ఆంక్షలను సింగపూర్ పూర్తిగా తొలగించింది. అక్టోబర్ 26 (మంగళవారం) నుంచి భారత ప్రయాణికులు సింగపూర్ వెళ్లొచ్చు. ఈ క్రమంలో ఆ దేశానికి వెళ్లే భారతీయులకు సింగపూర్ కొన్ని రూల్స్ పెట్టింది. వాటిలో ముఖ్యమైంది 10 రోజుల స్టేహోం ఒకటి. దీంతోపాటు మరికొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. వాటిపై మనం ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 


1. ప్రయాణానికి 48 గంటల ముందు ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టు తప్పనిసరి. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్నదై ఉండాలి. ఆ టెస్టు రిపోర్టులో పరీక్ష చేయించుకున్న తేదీ, ఫలితం, ట్రావెలర్ పేరు, పుట్టిన తేదీ లేదా పాస్‌పోర్టు నెంబర్ ఉండాలి. 

2. 10 రోజుల స్టేహోం తప్పనిసరి. 

3. స్టేహోం సమయంలో పదోరోజు మరోసారి పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.  

     

ఇదిలా ఉంటే.. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన ప్రయాణికులందరూ అక్టోబర్ 26 నుండి సింగపూర్ వచ్చేందుకు అనుమతించబడతారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం తెలిపింది. ఈ ఆరు దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ వెల్లడించారు. అందుకే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల ఇకపై కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా, సింగపూర్‌లో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1.73 లక్షల మంది కరోనా బారిన పడగా.. వీరిలో 315 మరణించారు. 


Updated Date - 2021-10-27T00:35:35+05:30 IST