మేం బానిసలమైపోయాం.. కరెంట్ షాక్‌లు ఇస్తున్నారు.. మయాన్మార్‌లో భారతీయుల గగ్గోలు!

ABN , First Publish Date - 2022-09-24T02:18:54+05:30 IST

మయాన్మార్‌లో(Myanmar) బందీలుగా మారిపోయామంటూ కొందరు భారతీయులు(Indians) గగ్గోలు పెడుతున్నారు.

మేం బానిసలమైపోయాం.. కరెంట్ షాక్‌లు ఇస్తున్నారు.. మయాన్మార్‌లో భారతీయుల గగ్గోలు!

ఎన్నారై డెస్క్: మయాన్మార్‌లో(Myanmar) బందీలుగా మారిపోయామంటూ కొందరు భారతీయులు(Indians) గగ్గోలు పెడుతున్నారు. తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పొట్టకూటి కోసం దేశం విడిచిన తాము చివరికి అక్రమార్కుల చేతికి చిక్కి నిత్యం నరకం అనుభవిస్తున్నామంటూ ఓ జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు.  మయాన్మార్‌లోని మియావడీలో గల(Myawaddy) కేకే పార్క్ అనే ఓ భారీ కాంప్లెక్స్‌లో తమను బంధించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 300 మంది భారతీయులు ఇలా దీనావస్థలో కూరుకుపోయారని తెలుస్తోంది. 


ఏమిటీ కేకే పార్క్..

ఇది.. విదేశీ పర్యాటకుల కోసం నిర్మించిన భారీ కాంప్లెక్స్‌. అందులో క్యాసినోతో పాటూ ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్.. షీ జిజియాంగ్ అనే చైనా వ్యాపారవేత్తది. నేర చరిత్ర కలిగిన అతడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ సుమారు 300 మంది భారతీయులు బందీలుగా ఉన్నారని సమాచారం. వారిలో కేరళీయులు 30 మంది దాకా ఉన్నారట. 


ఉద్యోగానికని వెళ్లి.. అక్రమార్కుల చేతిలో చిక్కి.. 

కేరళ రాష్ట్రానికి చెందిన అనేక మంది డీటీపీ ఆపరేటర్లుగా పనిచేసేందుకు.. జూలై, ఆగస్టు నెలల్లో థాయ్‌ల్యాండ్ వెళ్లారు. బ్యాంకాక్‌లో దిగాక వారిని తీసుకెళ్లేందుకు కొందరు వచ్చారు. ఆ తరువాత కేరళీయులను తుపాకీతో బెదిరించి బలవంతంగా మయాన్మార్‌కు తరలించారు. ‘‘తుపాకీలు చేతబట్టి మా వెంటే వస్తున్న వారు మా భద్రత కోసం కాదన్నది అర్థమవగానే.. మమ్మల్ని కిడ్నాప్ చేశారన్న విషయం బోధపడింది.’’ అని వారిలో కొందరు తాజాగా మీడియాకు తెలిపారు. ‘‘అక్కడి నుంచి బయటపడేది లేదని మాకు ఆ క్యాంపులో కాలుపెట్టగానే అర్థమైంది. మేము పాటించాల్సిన నియమనిబంధనల గురించి మాకు వివరించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని చంపేసి, పాస్‌పోర్టులతో సహా థాయ్‌ల్యాండ్ బోర్డర్ వద్ద పడేస్తామని హెచ్చరించారు.’’ అని చెప్పారు. 


తొమ్మిది మందికి స్వేచ్ఛ.. 

బందీలుగా ఉన్న భారతీయుల్లో తొమ్మిది మంది ఐటీ నిపుణులు భారత్‌కు సురక్షితంగా తిరిగొచ్చారని ఎంబీటీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలో కొంత మొత్తాన్ని కిడ్నాపర్లకు చెల్లించాకే వారు భారత్‌కు తిరిగొచ్చారన్నారు. తమను బందీలుగా ఉంచిన కాంప్లెక్స్‌కు 24 గంటలూ సాయుధులైన సెక్యూరిటీగార్డులు కాపలాగా ఉంటారని  మరో బాధితుడు తెలిపారు. పైసా చెల్లించకుండా రోజుకు 16 గంటల పాటు తమచేత చాకిరీ చేయించుకుంటారని చెప్పారు. తమ పాస్‌పోర్టులు లాగేసుకున్నారని, తమ ఫోన్లను నిరంతరం తనిఖీ చేస్తుంటారని వాపోయారు. కానీ..కొందరు ప్రాణాలకు తెగించి మరీ భారత మీడియా ప్రతినిధులను సంప్రదించారు. ‘‘మేము అక్కడ బానిసలమైపోయాం. మాతో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఫిషింగ్ దాడులు చేయించి.. పెద్ద ఎత్తున విదేశీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈపనికి ఒప్పుకోని వారికి టేజర్ గన్నులతో కరెంట్ షాకులు ఇస్తున్నారు’’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. భారతీయులను బంధించారన్న వార్త మీడియాలో రావడంతో  అక్కడ తనిఖీలు పెరిగాయని చెప్పారు. కొందరిని ఇతర ప్రాంతాలకు కూడా తరలించారని తెలిపారు.


హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ నిపుణుడు.. మయాన్మార్ అక్రమార్కులు కోరిన మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి బయటపడగలిగాడు. 5 వేల డాలర్లను క్రిప్టోకరెన్సీలో చెల్లించాలని వారు డిమాండ్ చేయడంతో అతడి కుటుంబసభ్యులు చెప్పినట్టే చేశారు. వారి సూచనల ప్రకారం.. కొన్ని కొనుగోళ్లు చేసి క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు చేశారు. ‘‘మా వాడు సరిహద్దు దాటి సురక్షితంగా థాయ్‌ల్యాండ్‌కు చేరుకున్నాకే మయాన్మార్ ఏజెంట్‌కు డబ్బులు చెల్లిస్తామని ముందుగానే ఒప్పందం చేసుకున్నాం’’ అని హైదరాబాదీ వ్యక్తి బంధువు తెలిపాడు. అతడు హైదరాబాద్‌కు ఎప్పుడు చేరుకుంటాడా అని ప్రస్తుతం ఆ ఐటీ ఉద్యోగి కుటుంబం ఎదురు చూస్తోంది. కాగా.. ఈ అంశంపై అమ్జద్ ఉల్లా ఖాన్‌ చేసిన ట్వీట్‌కు విదేశీ వ్యవహారాల శాఖ గురువారం స్పందించింది. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇవ్వాలంటూ కొన్ని ఫొన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీని ట్వీటర్‌లో షేర్ చేసింది. 

Updated Date - 2022-09-24T02:18:54+05:30 IST