‘కాబూల్‌లో భారతీయులు క్షేమం’

ABN , First Publish Date - 2021-08-21T22:09:56+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పరిసరాల్లో భారతీయులు

‘కాబూల్‌లో భారతీయులు క్షేమం’

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పరిసరాల్లో భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా శనివారం పేర్కొంది. 150 మందికిపైగా తాలిబన్ల నిర్బంధంలో ఉన్నారని, వీరిలో అత్యధికులు భారతీయులేనని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు స్పందించినట్లు తెలిపింది. అధికారులు అక్కడి భారతీయులతో నిరంతరం మాట్లాడుతున్నారని పేర్కొంది. కాబూల్‌లోని భారతీయులకు మధ్యాహ్న భోజనం అందజేశారని, వారు విమానాశ్రయానికి బయల్దేరారని చెప్పినట్లు తెలిపింది. 


ఇదిలావుండగా, తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసీక్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, సుమారు 150 మంది భారతీయులను తాము నిర్బంధినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. వీరంతా హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఉన్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా విమానాశ్రయానికి చేర్చినట్లు తెలిపారు. 


కాబూల్ విమానాశ్రయం వద్ద దాదాపు 100 నుంచి 150 మంది భారతీయులను తాలిబన్లు నిర్బంధించారని కొందరు ఆఫ్ఘన్ పాత్రికేయులు చెప్పినట్లు సామాజిక మాధ్యమాల్లో  వార్తలు వెలువడిన కొద్ది క్షణాల్లో కాబూల్‌లోని పాత్రికేయులు స్పందిస్తూ, భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, వారిని తనిఖీ చేసేందుకు తాలిబన్లు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. 


Updated Date - 2021-08-21T22:09:56+05:30 IST