దేశంలో Monkeypox కలకలం.. కేరళలో తొలికేసు నమోదు
ABN , First Publish Date - 2022-07-15T02:30:11+05:30 IST
దేశంలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో
తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపారు. తాజాగా, వచ్చిన ఫలితాల్లో అతడికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ (Veena George) తెలిపారు.
బాధితులు ఈ నెల 12న కేరళ చేరుకున్నట్టు మంత్రి తెలిపారు. త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే డబ్ల్యూహెచ్ఓ (WHO), ఐసీఎంఆర్ (ICMR) మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణికులను పరీక్షించినట్టు చెప్పారు. వైరస్ నిర్ధారణ వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేరళ ప్రభుత్వానికి మల్టీ డిసిప్లినరీ కేంద్ర బృందం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.